‘కొంతకాలంగా టాలీవుడ్లో కథానాయికలుగా తెలుగు అమ్మాయిల్ని ప్రోత్సహిస్తుండటం అభినందనీయం. నా సినిమాల్లో ప్రధాన పాత్రల కోసం ఎక్కువగా తెలుగు వాళ్లనే ఎంపిక చేస్తుంటా. ‘రంగస్థలం’ సినిమాలో తెలుగు భాషపై పట్టుందనే ఆలోచనతోనే సమంతను హీరోయిన్గా తీసుకున్నా. నా తదుపరి సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయికి అవకాశమిస్తా’ అని అన్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. ‘ప్లేబ్యాక్’ చిత్ర విజయోత్సవ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దినేష్తేజ్, అనన్య జంటగా నటించిన ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకుడు. ఈ వేడుకలో ‘ప్లేబ్యాక్’ పాన్ ఇండియన్ పోస్టర్ను సుకుమార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘లాజిక్లంటే చిన్నతనం నుంచి నాకు చాలా ఇష్టం. లాజిక్లతో నేను చేసిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. కానీ సూపర్హిట్ అవ్వడం లేదనే ఆలోచనతో వాటిని పక్కనపెట్టా. హరిప్రసాద్ మాత్రం లాజిక్లను వదిలిపెట్టకుండా ఈ సినిమా చేశాడు. కొత్త తరహా సినిమా చేస్తే ప్రేక్షకుల ఆదరిస్తారని మరోసారి నిరూపించింది. ప్రయోగాత్మక సినిమాలు హాలీవుడ్లోనే వస్తాయనేది అపోహ మాత్రమే. గొప్ప కథలతో సినిమాలు చేయగల ప్రతిభావంతులైన ఔత్సహికులు ఎంతో మంది మన దగ్గర ఉన్నారు. వారిని ప్రోత్సహించే ప్రసాద్రావు లాంటి ధైర్యమున్న నిర్మాతలు కావాలి. సినిమాలో అనన్య సహజ అభినయాన్ని కనబరిచింది. దినేష్తేజ్, అర్జున్కల్యాణ్, సంగీత దర్శకుడు కమ్రాన్లకు చక్కటి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారు. ‘మూడేళ్ల కష్టానికి ప్రతిఫలమిది. సినిమాలపై ఇష్టంతో డబ్బుల గురించి ఆలోచించకుండా నిర్మాత ప్రసాద్రావు కథను నమ్మి ఈ సినిమాను నిర్మించారు’ అని దర్శకుడు హరిప్రసాద్ జక్కా చెప్పారు. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నానికి సుకుమార్ అండగా నిలవడం ఆనందంగా ఉందని నిర్మాత పేర్కొన్నారు. జెమిని ఫిలిం సర్క్యూట్ ద్వారా పాన్ ఇండియన్ స్థాయిలో హరిప్రసాద్ దర్శకత్వంలో అన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మించబోతున్నామని సీఈవో మూర్తి అన్నారు.