హైదరాబాద్ : తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానం అని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టినందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్ష, కార్యదర్శి వర్గం బుధవారం సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటిదాకా తాము ఇచ్చిన గొంగడి కప్పుకొని, గొర్రె పిల్లను పట్టుకొని పోయిన పాలకులే తప్ప, తమకు గొర్రె పిల్లలను ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆర్ మాత్రమేనని కురుమ సంఘం నాయకులు అన్నారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు అయిన మొదటి సంవత్సరమే గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అప్పుడు ఏ ఎన్నికలున్నయి? తమది ఎన్నికల విధానం కాదన్నారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కొనసాగిస్తున్న పథకాలు ఎల్లకాలం కొనసాగేలా రూపొందించినట్లు చెప్పారు.
గొర్రెల పెంపకానికి గ్రామాల్లో షెడ్ల నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు సీఎం తెలిపారు. యాదవులు, గొల్ల కురుమలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామన్నారు. గొర్రెల పాపులేషన్ లో నేడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నదన్నారు. తెలంగాణ సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎన్ని ఆటంకాలెదురైనా మరింత పట్టుదలతో అభివృద్ధి ప్రస్థానం కొనసాగిస్తూనే ఉంటామని సీఎం పేర్కొన్నారు.