నిజాం పాలనలో అడుగడుగునా అవమానాలు, అత్యాచారాలు, సామాజిక ఛీత్కారాలు.. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల ఏలుబడిలో కడుపుకోతలు, కన్నీటి శోకాలు, తాగునీటికి తండ్లాటలు.. ఆడబిడ్డల దశాబ్దాల దుఃఖాన్ని ఏడేండ్ల తెలంగాణ తుడిచేసింది. స్వపాలనలో,కేసీఆర్ సారథ్యంలో స్త్రీలు సగర్వంగా తలెత్తుకొని జీవిస్తున్నారు. కలలు పండుతుండగా, బతుకుల్లో పన్నీటి జల్లులు కురుస్తుండగా చూసి మురిసిపోతున్నారు. రాజకీయాలు, అభివృద్ధి, సంక్షేమాల్లో సగంవాటా పొందుతూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆడబిడ్డను పిలిచి, బట్టలు పెట్టి దీవెనార్తెలు తీసుకోవటం తెలంగాణ సంప్రదాయం. ఆ ఆనవాయితీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతీ కార్యక్రమంలోనూ కొనసాగిస్తున్నది. చులకన భావానికి, ఛీత్కారాలకు గురైన మహిళలకు ఉన్నతస్థానాన్ని కల్పిస్తున్నది. రెండు పడక గదుల ఇల్లయినా, కల్యాణలక్ష్మి చెక్కులైనా, మూడు ఎకరాల భూమైనా ఆడబిడ్డ పేరిటే అందిస్తూ తెలంగాణ సంప్రదాయం ఇదీ అని చాటిచెప్తున్నది. నాడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచిన మన ఆడబిడ్డలు.. మిషన్ భగీరథ పుణ్యమా అని గడపదాటే అవసరం లేకుండా పోయింది. ఇంటికే నల్లా నీరు వస్తుండటంతో కష్టాలు తప్పాయి. సంక్షేమ రంగంలోనూ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ వస్తున్నది. పుట్టింది మొదలు పళ్లై, సంతానం కలిగే వరకు తెలంగాణ సర్కారు ఆడబిడ్డకు తోడుగా నిలుస్తున్నది. కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి తదితర పథకాలతో నేరుగా మహిళలకు భరోసాను ఇస్తున్నది. బాల్యవివాహాలు తగ్గటమే ఏడేండ్ల తెలంగాణ విజయానికి తార్కాణం. వింతంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికుల జీవితాల్లో పింఛనుతో భరోసా నింపుతున్నది. అభాగ్యులు, వేధింపులకు గురవుతున్న మహిళలకు షీటీమ్స్, సఖీ కేంద్రాల ద్వారా భద్రతను కల్పిస్తున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే ఏడేండ్ల పాలనలో మహిళలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నారు. సగర్వంగా జీవిస్తున్నారు.
అవకాశాల్లో సగభాగం
సంక్షేమ పథకాలే కాదు రాజకీయ, విద్యా అవకాశాల్లోనూ స్వరాష్ట్రంలో మహిళలు సగవాటాను పొందుతున్నారు. గతంలో డబ్బు, పలుకుబడి ఉంటే తప్ప మహిళలకు రాజకీయ
అవకాశాలు లభించేవి కావు. అందుకు భిన్నంగా స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నామినెటెడ్ పోస్టులు మొదలు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో వాళ్లకు సగం స్థానాలను కట్టబెట్టారు. గతంలో ఎన్నడూ ఏ పార్టీ ఇవ్వని విధంగా ఇటీవల హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం మహిళకు కేటాయించటం మహిళలు
పొందుతున్న రాజకీయ అవకాశాలకు నిదర్శనం. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ పీఠాలను సైతం మహిళలకే కట్టబెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏడేండ్ల కాలంలో తెలంగాణలో మహిళలకు విద్యావకాశాలు గతం
కంటే ఎంతో మెరుగయ్యాయి.
రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉపాధి, ఉద్యోగాల్లోనూ అన్నింట్లోనూ తెలంగాణ ప్రభుత్వం మహిళలకుప్రాధాన్యత ఇస్తున్నది.
స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్
నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్
రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్య
67,486 మంది (50.07శాతం)
సంక్షేమంలో.. (2021 మార్చినాటికి)
కల్యాణలక్ష్మి/షాదీముబారక్ లబ్ధిదారులు 8,04,521
ఒంటరి మహిళలు పింఛన్ 1.34లక్షల మంది
వితంతు పింఛన్ 13.4లక్షల మంది
బీడీ కార్మికులు 4.21లక్షల మంది
ఆరోగ్యంలో..
ఆరోగ్యలక్ష్మి లబ్ధిదారులు 4,61,800 మంది
కేసీఆర్ కిట్లు పొందిన మహిళలు 5,60,663
300 అమ్మ ఒడివాహనాలతో
లబ్ధిపొందిన మహిళలు 23,03,546
ఐటీ పారిశ్రామిక రంగంలో
ఉమెన్ ఎంపర్మెంట్ హబ్
(ఉపాధి అవకాశాలు) 321 మందికి
స్టార్టప్లకు మద్దతు 276
స్టార్టప్ ఇంక్యుబేషన్ 148
స్టార్టప్ ప్రోగ్రామ్స్ 12
మహిళా ఎంట్రప్రెన్యూర్లు 3,427
దాతల ద్వారా మహిళలకు
సమకూర్చిన నిధులు 32.6కోట్లు
విద్యారంగంలో
ప్రభుత్వ రంగంలో
విద్యనభ్యసిస్తున్న బాలికలు 67.04 శాతం
డిగ్రీ కళాశాలలు 30 ఏర్పాటు
వొకేషనల్ కాలేజీలు 24
ఎక్స్లెన్సీ సెంటర్స్ 16
గురుకులాలు 56
భువనగిరిలో ఆర్మ్డ్ ఫోర్స్ కళాశాల 1
సంగారెడ్డిలో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్
న్యాయవిద్యాకళాశాల 1
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్
రుణాల్లో 25-35శాతం మహిళలకే కేటాయింపు
షీ టీమ్స్ 331 (2019-20లోనే
18095 మందికి భరోసా)