హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వాటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. శనివారం రాజేంద్రనగర్లోని జాతీయ చిరుధాన్యాల పరిశోధన కేంద్రంలో జరిగిన ఆగ్రోస్ బోర్డు సమావేశం అనంతరం ఆయన పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. అధిక డిమాండ్ నేపథ్యంలో రైతులు చిరుధాన్యాల పంటల సాగు దిశగా దృష్టిసారించాలని కోరారు. ప్రతి రైతు తన సాగు భూమిలో 20 శాతం చిరుధాన్యాలకు కేటాయించాలని సూచించారు. చిరుధాన్యాల ప్రాసెసింగ్ వైపు యువతను మళ్లించాలని పేర్కొన్నారు. చిరుధాన్యాలకు కూడా మద్దతు ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, ఐఐఎంఆర్ డైరెక్టర్ విలాస్, ఆగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.