హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) తెలంగాణలో విద్యుత్తు చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొనడానికి కారణాలేమిటి? కారకులు ఎవరు? ఇందులో రాష్ట్రం పాత్ర ఎంత? కేంద్రం పాత్ర ఏమిటి? ఒకప్పుడు చీకట్లో మగ్గిపోయిన తెలంగాణ ఇవాళ 24 గంటలూ నిరంతరాయంగా విద్యుత్తు వెలుగులు విరజిమ్మడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం కృషి చేసింది? కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ విద్యుత్తు సంస్థలు ఎందుకు నష్టాల్లో ఉన్నాయి? తెలంగాణకు విద్యుత్తు అవసరం ఎంత ఉన్నది? విద్యుత్తు లేకపోతే.. గతంలో తెలంగాణలో ఎదురైన అనుభవాలేమిటి? దశాబ్దాల తరబడి విద్యుత్తు తప్ప మరో మార్గం లేని భౌగోళిక పరిస్థితులు.. దశాబ్దాలపాటు అప్పులు, ఆత్మహత్యల్లో కూరుకుపోయిన వ్యవసాయరంగం ఒకవైపు, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ ధోరణి, ఆంక్షలు ఇంకోవైపు.. కలగలిసి ఇవాళ విద్యుత్తు చార్జీల పెంపు వైపు ప్రభుత్వం అడుగులు వేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తన ప్రజలకు నాణ్యమైన.. నిరంతర విద్యుత్తు అందించాలన్న తపన కలిగిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలకు మధ్య తలెత్తిన ఘర్షణ ప్రభావమే విద్యుత్తు చార్జీలు పెంచాలన్న ప్రతిపాదనకు కారణమయింది.
రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా.. వ్యవసాయానికి నీటిని అందించాలంటే.. బోర్లు, బావులకు మోటర్లు తప్పనిసరి. రాష్ట్రం వచ్చేనాటికి 19.03 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉండగా.. 1.9.2021 నాటికి అవి 25.63 లక్షలకు పెరిగాయి. ప్రతిరోజూ విద్యుత్తు వినియోగంలో సుమారు 35% పైగా వ్యవసాయరంగానిదే ఉంటుంది. సగటున ఒక్కో మోటర్ కింద 4 ఎకరాలు పారకం అనుకొన్నా.. సుమారు కోటి ఎకరాలకు పైగా సాగుభూమిలో వ్యవసాయం చేయడానికి మోటర్లే దిక్కు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే తెలంగాణలో అతి పెద్ద సాగునీటి ప్రాజెక్టు.. ‘కరెంట్’ అని చెప్పక తప్పదు. వ్యవసాయ, సాగునీటి శాఖల అంచనాల ప్రకారం చూసుకున్నా.. రాష్ట్రంలో మొత్తం 1.30 కోట్ల ఎకరాలు సాగవుతున్నది. ఉద్యాన పంటలు మరో 10 లక్షల లోపు ఉంటాయి. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల కింద 36 నుంచి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కార్యాచరణ సిద్ధమైంది. ఈ లెక్కన చూసుకున్నా మోటర్ల ద్వారానే దాదాపు కోటి ఎకరాల్లో పంటలు పండిస్తున్నారనేది స్పష్టం.
కానీ తాజాగా ఆర్థిక క్రమశిక్షణ పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సరఫరాపై తీసుకొంటున్న నిర్ణయాలు తెలంగాణ రైతులను చక్రబంధంలో ఇరికిస్తున్నాయి. రైతులకు ఉచితంగా విద్యుత్తు ఇవ్వొద్దని.. మోటర్లకు విద్యుత్తు మీటర్లు బిగించాలని.. ముందుగా బిల్లులు కట్టిన తర్వాతే ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేయాలని.. అవసరమైన విద్యుత్తును కొనాలంటే తప్పనిసరిగా ప్రతినెలా ఎల్సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) తీసుకోవాలని.. క్రాస్ సబ్సిడీలు ఎత్తివేయాలని.. ఇలా పలు చట్టాలు రూపొందిస్తున్నది. ఇవన్నీ చిట్టచివరికి రైతుపైనే ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణ రైతులకు శాపంలా పరిణమిస్తున్నాయి.
తెలంగాణకు సంబంధించినంత వరకు అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు ఏమిటంటే.. కరెంట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే మన రాష్ట్రంలో వ్యవసాయం పూర్తిగా కరెంట్ ఆధారితమే. 24 లక్షలకు పైగా బోరుబావులు.. కాళేశ్వరం సహా అనేక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తే ప్రధాన వనరు. తెలంగాణ ప్రభుత్వం రావడంతోనే అత్యంత ప్రాధాన్య అంశంగా కరెంట్ను చేపట్టింది. 2014 వరకు చీకట్లో మగ్గిపోయి.. అసంఖ్యాకంగా రైతుల ఆత్మహత్యలకు కారణమైన విద్యుత్తు సమస్యను అహరహం శ్రమించి పరిష్కరించింది. ఆరు నెలల్లోనే కోతల్లేని విద్యుత్తును అందించింది. అనతికాలంలోనే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తును అందించింది. ఆత్మహత్యలను నివారించింది. కాళేశ్వరం వంటి భారీ సాగు నీటి పారుదల ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తిచేసి.. వ్యవసాయాన్ని సుసంపన్నం చేసింది. వీటన్నింటికీ అనివార్యంగా కరెంటే మూల సరుకు అయింది. పంటలు పండించడానికి నీళ్లు ఇవ్వాలి. ఇతర రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ దక్కను పీఠభూమి. ఇక్కడ పల్లంలోకి కాల్వల ద్వారా సహజంగా నీటిని పారించి అందించడం సాధ్యమయ్యే పనికాదు. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎత్తిపోయడం ఒక్కటే సాగునీటికి పరిష్కారం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం లిఫ్ట్ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నది. వాటికి విద్యుత్తు పెద్ద మొత్తంలో అవసరం. అందుకే ప్రాజెక్టులతోపాటే.. విద్యుదుత్పత్తికీ కార్యాచరణ చేపట్టింది. ప్రత్యామ్నాయ విద్యుదుత్పత్తికి ప్రణాళికాబద్ధంగా ముందుకుపోతున్నది. సింగరేణి వంటి సంస్థలు పెద్ద ఎత్తున సౌర విద్యుదుత్పత్తికి పూనుకొన్నాయి. థర్మల్ విద్యుదుత్పత్తికీ.. యాదాద్రి వంటి ప్లాంట్ల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి.