హైదరాబాద్ : మానవ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామిది సహజ మరణం కాదు.. ఆయనను మోదీ ప్రభుత్వమే చంపిందని సీపీఐ(మావోయిస్టు) పార్టీ ఆరోపించింది. ఈ మేరకు మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ గురువారం మీడియాకు ఓ లేఖను విడుదల చేశారు. స్వామి మరణం పార్టీ నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని లేఖలో పేర్కొన్నారు.
ఆదివాసీల హక్కుల కోసం, వారి సమస్యలకు పరిష్కార మార్గాల కోసం పోరాడుతున్న స్టాన్ స్వామిని, భీమా కోరేగావ్ కేసులో చట్ట విరుద్ధమైన కార్యకలాపాల నివారణ చట్టం(యూఏపీఏ) కింద మోదీ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిందన్నారు. ఈ క్రమంలో ఆయన బెయిల్ విషయంలో బాంబే హైకోర్టు సరిగా స్పందించకపోవడం దారుణమన్నారు. అప్పటికే పార్కిన్సన్ వ్యాధితో పాటు ఇతర రోగాలతో బాధపడుతున్న స్వామిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), జైలు అధికారులు క్రూరంగా హింసించారు అని అభయ్ తన లేఖలో పేర్కొన్నారు.
కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే స్టాన్ స్వామిని మోదీ ప్రభుత్వం హత్య చేసిందన్నారు. ఆయన ఆరోగ్యం విషమిస్తున్నప్పటికీ.. బెయిల్ నిరాకరించడం దారుణం అని పేర్కొన్నారు. భవిష్యత్లో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని కూడా వదలరని అభయ్ అన్నారు. స్వామి మరణానికి కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.