హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపునకు కేబినెట్ సబ్ కమిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11:30 గంటలకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ సమావేశం కానున్నారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీ, ఇతర అధికారులు పాల్గొననున్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచాలన్న కేబినెట్ సబ్ కమిటీ సూచనపై చర్చించనున్నారు.
భూముల విలువ పెంపునకు విధివిధానాలపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై చర్చించనున్నారు. ప్రాంతాల వారీగా ప్రభుత్వ విలువలు, ప్రస్తుత మార్కెట్ విలువలను పరిశీలించనున్నారు. వాణిజ్య ఆస్తుల విలువ పెంపు విధివిధానాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. సాధారణ ఆస్తులు, ఇల్లు, ఖాళీ స్థలాలు, భూముల విలువపై సమీక్షించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను పరిశీలించనున్నారు.