ముంబై : తన పెర్ఫామెన్స్ కోసం నగదుకు బదులు క్రిప్టోకరెన్సీని తీసుకునేందుకు అంగీకరించిన తొలి భారతీయ ఆర్టిస్ట్ గా రాపర్ రఫ్తార్ నిలిచారు. తాను బ్లాక్ చైన్ టెక్నాలజీని అమితంగా ఇష్టపడతానని, ఈ మాధ్యమాన్ని కళాకారులు, మేనేజర్లు ఎందుకు అనుసరించడం లేదని తాను ఆశ్చర్యపోతుంటానని రఫ్తార్ అన్నారు. ఈ దిశగా తాను బుడిబుడి అడుగులు వేస్తున్నానని, తన మేనేజర్ చొరవతోనే ఇది సాధ్యపడిందని ఆయన చెప్పుకొచ్చారు. తన కలను సాకారం చేసిన ఘనత మేనేజర్ అంకిత్ ఖన్నాకే దక్కుతుందని చెప్పారు.
జులై రెండవ వారంలో జరగాల్సిన తన వర్చువల్ పెర్ఫామెన్స్ కోసం రఫ్తార్ క్రిప్టోకరెన్సీలో ఫీజు తీసుకునేందుకు అంగీకరించారు. కెనడాలో 60 నిమిషాల పాటు జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్ లో 100 మంది అతిధుల ఎదుట రఫ్తార్ తన ప్రదర్శన ఇవ్వనున్నారు. రఫ్తార్ వర్చువల్ కరెన్సీని తీసుకోవడం ద్వారా ఇక దళారీల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజల్లోకి వెళతారని ఆయన మేనేజర్ అంకిత్ ఖన్నా పేర్కొన్నారు.