శ్రీశైలం : శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే కరెంట్ ఉత్పత్తి కోసమని అటువంటిది శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తిని ఆపాలని చూడడం అర్థరహితమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రధానికి ఏపీ సీఎం లేఖ రాయడంపై మంత్రి స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. సమైక్య పాలనలో కృష్ణానది నీళ్లను ఆంధ్రా పాలకులు ఇష్టమొచ్చినట్లు దోచుకున్నరన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం తెలంగాణలోనే ఎక్కువగా ఉందన్నారు.
కృష్ణానది నీటి పంపకాలు శాశ్వత ప్రాతిపదికన జరగాలన్నారు. ఒక నది బేసిన్లో ఉన్న ప్రాంత నీటి అవసరాలు తీరాకే ఇతర ప్రాంతాలకు తరలించాలని నిపుణులు చెప్పారు. కాగా ఏపీ పాలకులు ఏకపక్షంగా రాయలసీమకు నీళ్లు తరలిస్తున్నరన్నారు. జాతీయ పార్టీలది అవకాశవాద వైఖరి, ప్రజల సమస్యలు వాళ్లకు పట్టవన్నారు.
శ్రీశైలం జలవిద్యుత్ ప్రాజెక్టు కొత్తది కాదన్నారు. అవసరం మేరకు ఉత్పత్తి చేసుకుంటమన్నారు. సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేంద్రం నిర్లక్ష్య వైఖరి వల్లే సమస్య జఠిలమవుతోందన్నారు. గతంలో కావేరి నీళ్ల కోసం తమిళనాడు, కర్ణాటక గొడవలు పడ్డాయన్నారు. తెలంగాణ పరాదీనం కావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అనేక కేసులు వేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఏపీలో ఒక్క కేసు అయినా వేశారా అని మంత్రి ప్రశ్నించారు.