మహబూబ్నగర్: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి భారీగా వరదనీరు వస్తున్నది. ప్రాజెక్టులోకి 2,69,716 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి 2,52,969 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు ప్రస్తుతం 212.91 టీఎంసీల నీరున్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి 1,36,307 క్యూసెక్కుల నీరు వస్తుండగా, సుంకేసల నుంచి 1,23,409 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ఇక శ్రీశైలం ఎడమ కాల్వకు 31,784 క్యూసెక్కులు, కుడికాల్వకు 30,456 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తుండగా, స్పిల్వే ద్వారా 2,23,128 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.