హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కొద్ది రోజులుగా వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపుర, జూరాలతోపాటు శ్రీశైలాన్ని నిండుకుండలా మార్చి నాగార్జునసాగర్కు పరుగులు తీస్తున్నది. శుక్రవారం శ్రీశైలం జలాశయానికి దాదాపు 4.60 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా, 10 గేట్ల ద్వారా సాగర్కు తరలుతున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా శుక్రవారం సాయంత్రానికి 232 టీఎంసీలకు చేరుకున్నది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే శనివారం గేట్లను ఎత్తే అవకాశమున్నదని ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోళి శివారులోని సుంకేశుల జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఎగువ నుంచి 30 వేలు క్యూసెక్కులు రాగా డ్యాం 10 గేట్ల ద్వారా 29 వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు. కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టులో ప్రస్తుతం 12 అడుగుల మేర నీటిమట్టం ఉన్నది. మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1323.72 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు నీటిమట్టం 639.25(3.05 టీఎంసీలు) అడుగులకు పెరిగింది.
ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరోసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లోలు నమోదయ్యే అవకాశం ఉన్నదని ఎస్సారెస్పీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి వానకాలం పంట సాగుకోసం నీటి విడుదల కొనసాగుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సరస్వతి బరాజ్కు వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం బరాజ్కు 28,400 క్యూసెక్కుల నీరు వస్తున్నది. బరాజ్ లో 10.87 టీఎంసీలకు ప్రస్తుతం 4.43 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.