నిజాంసాగర్, ఏప్రిల్ 26: నిత్యం జలకళ ఉండేలా నిజాంసాగర్లోకి గోదావరి నీటిని మళ్లించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్ అని ఆయకట్టు రైతులు జేజేలు పలుకుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరిన సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల రైతులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తున్నారు. హసన్పల్లి గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పెద్దపట్లోల్ల సిద్ధార్థరెడ్డి ఆధ్వర్యంలో, మగ్ధుంపూర్ గ్రామంలో సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ, సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, సర్పంచ్ లక్ష్మీనారాయణతోపాటు ఆయకట్టు రైతులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి సోమవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీటి జాడలేక కళాహీనంగా మారిన ప్రాజెక్టు.. సీఎం కేసీఆర్ చొరవతో జలకళ సంతరించుకున్నదని అన్నారు. ఇక ముందు ఆయకట్టు కింద సాగునీటికి ఎలాంటి ఢోకా లేదని , రెండు పంటలను సాగు చేసుకుంటామని హర్షం వ్యక్తంచేశారు.