హైదరాబాద్ : ప్రముఖ తెలుగు రచయిత, భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జయంతి ఈవాళ. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పైడిమర్రి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. తన క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వెంకటసుబ్బారావు సేవలను మంత్రి కొనియాడారు. పైడిమర్రి నల్లగొండ జిల్లా అనపర్తికి చెందిన వ్యక్తి అని తెలిపారు.
ఆయన రాసిన జాతీయ ప్రతిజ్ఞ విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమను, సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, చరిత్రకారులను స్మరించుకుంటూ వారి జనన, మరణ వార్షికోత్సవాలకు నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, టీఎన్జీవోస్ సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు ఎం.రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.