కరోనా నేపథ్యంలో ప్రజలను భయాందోళనలకు గురిచేసే విధంగా పుకార్లు సృష్టిస్తున్నవారిపై.. నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై.. నగర పోలీసులు నిఘా పెట్టారు.. అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేస్తున్నా రు. కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొందరు ప్రైవేట్ యూట్యూబ్, యాప్లు, వెబ్సైట్ల నిర్వాహకులు ఉహాజనితమైన వార్తలు రాయడం, ఎక్కడో జరిగిన ఘటనలను తాజాగా హైదరాబాద్లోనే జరిగినట్లు కట్టు కథలు అల్లి యూట్యూబ్, సోషల్ మీడియాలలో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు. పోలీసులు నిరంతరం ఇలాంటి వాటిపై నిఘా ఉంచుతూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై సుమోటోగా కేసులు నమోదు చే స్తున్నారు. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో రాత్రి వేళల్లో కర్ఫ్యూను విధించింది. అయితే గత ఏడాది ఎక్కడో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలను.. తాజాగా హైదరాబాద్లో జరిగినట్లు సృష్టించిన ఓ ప్రైవేట్ యూట్యూబ్ చానల్.. తన చానల్లో ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేసింది. దీనిపై స్పందించిన సీపీ వెంటనే.. ఆ చానల్పై కేసులు నమోదు చేయాలని ఆదేశిస్తూ, ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.