ఎయిర్ పిస్టల్లో భారత జట్లకు స్వర్ణాలు
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ టీమ్ విభాగాల్లో భారత షూటింగ్ జట్లు అదరగొట్టాయి. ఆదివారం ఇక్కడి కర్ణిసింగ్ రేంజ్లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు కైవసం చేసుకున్నాయి. తొలుత మహిళల ఫైనల్లో యశస్విని సింగ్ దేస్వాల్, మనూ బాకర్, శ్రీ నివేథతో కూడిన భారత టీమ్ 16-8తో పోలాండ్ను ఓడించి అగ్రస్థానంలో నిలిచింది. అనంతరం సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, షహజర్ రిజ్వి 17-11తో వియత్నాంను ఓడించి బంగారు పతకం గెలుచుకున్నారు. కాగా ఎయిర్ రైఫిల్ ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దీపక్ కుమార్,పంకజ్ కుమార్తో కూడిన భారత జట్టు రెండో స్థానంలో నిలిచి వెండి పతకం కైవసం చేసుకోగా.. అమెరికాకు స్వర్ణం దక్కింది.
ఈ విభాగంలో నిషా కన్వాల్, శ్రియాంక, అపూర్వి చండేలాతో కూడిన మన మహిళల జట్టు నాలుగో స్థానానికే పరిమితం కాగా.. అమెరికానే టాప్లో నిలిచింది. మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచిన భారత యువ షూటర్ గనేమత్ షేఖోన్ కాంస్యం చేజిక్కించుకుంది. సీనియర్ ప్రపంచకప్లో భారత్కు ఈ విభాగంలో పతకం దక్కడం ఇదే తొలిసారి.