హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): చైత్ర శుద్ధ నవమి వచ్చేసింది.. సీతమ్మవారి మెడలో శ్రీరాముడు మూడు ముళ్లు వేసే సుమధుర ఘట్టానికి వేళైంది.. ఈ అద్భుత ఘట్టాన్ని తనివితీరా వీక్షించాలని ఉవ్విళ్లూరే భక్తులకోరిక తీరే సందర్భం ఆసన్నమైంది.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి స్వామివారి ఎదుర్కోలు ఉత్సవం వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పాల్గొని ఉత్సవాన్ని తిలకించారు. బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం జరుగనున్నది. ఈ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్రెడ్డి.. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు. కరోనా వల్ల ఈ ఏడాది కూడా కల్యాణ మహోత్సవాన్ని నిరాడంబరంగా జరపనున్నట్టు మంత్రి తెలిపారు. కొవిడ్ నిబంధనలతో పరిమిత సంఖ్యలో భక్తులు, అర్చక స్వాములు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.