న్యూఢిల్లీ, జూలై 10: ఢిల్లీలో శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తే ఇక భారీ జరిమానాలు తప్పవు. అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, డీజిల్ జనరేటర్ (డీజీ) సెట్లు ఉపయోగిస్తే రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ఫైన్ విధించనున్నారు. ఈ కొత్త నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ) అధికారులను ఆదేశించింది. బహిరంగ ప్రదేశంలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ ఉపయోగించరాదు. రాత్రిపూట అసలు వాడరాదు. దీనిని ఉల్లంఘిస్తే రూ.10 వేలు జరిమానా విధిస్తారు. 1000 కేవీఏకి మించిన డీజీ సెట్లను వినియోగిస్తే రూ.లక్ష ఫైన్ వసూలు చేస్తారు. నివాస ప్రాంతాల్లో పగటిపూట శబ్ద స్థాయి 55 డెసిబిల్, రాత్రివేళ 45 డెసిబిల్కి మించకూడదు. పాఠశాలలు, కళాశాలలు, దవాఖానలు, కోర్టులకు 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని ‘సైలెంట్ జోన్లు’గా ప్రకటించారు. వివాహ వేడుక సమయంలో బాణసంచా కాల్చరాదు.