హైదరాబాద్ : క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మినీ స్టేడియాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఇప్పటికే 50 శాతానికి పైగా స్టేడియంల నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు మిగిలినవి కూడా త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు.
2021 ఒలింపిక్ దినోత్సవ వేడుకలకు సంబంధించి తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ బుధవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాలను అనుసరించి క్రీడలను ప్రోత్సహించడానికి, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన క్రీడా విధానాన్ని రూపొందించేందుకు సీఎం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు.
ఐటి మంత్రి కేటీఆర్ సూచనల మేరకు తాము కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధుల సహాయంతో క్రీడలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. టోక్యో ఒలింపిక్స్లో సానియా మీర్జా, సాయి ప్రణీత్ రాణించగలరని, రాష్ట్రానికి పురస్కారాలను తెస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.