హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను సమకూర్చే చర్యలను పౌరసరఫరాలశాఖ వేగవంతం చేసింది. గత యాసంగిలో సీఎంఆర్ గడువు ముగియడంతో సుమారు లక్ష టన్నుల బియ్యంను ఎఫ్సీఐ తీసుకోలేదు. దీంతో సుమారు రూ.300 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉన్నది. ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఈ నేపథ్యంలో ఈసారి ఆలస్యం కాకుడదనే ఉద్దేశంతో మిల్లర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నది. ఇప్పటివరకు సుమారు 20 లక్షల టన్నుల సీఎంఆర్ను అందించింది. యాసంగిలో సుమారు 93 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాలశాఖ కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి 62.75 లక్షల టన్నుల సీఎంఆర్ బియ్యంను ఎఫ్సీఐకి అందించాల్సి ఉంటుంది.
మరో 20 లక్షల టన్నులకు అంగీకారం
యాసంగిలో 62.75 లక్షల టన్నుల సీఎంఆర్కు కేవలం 24.75 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటామని ఎఫ్సీఐ తెలిపింది. ఇదే జరిగితే ప్రభుత్వం రూ.వేల కోట్ల అర్థిక భారం పడుతుంది. దీంతో సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్తో మాట్లాడటంతో మరో 20 లక్షల టన్నులకు అంగీకరించారు. దీనిపై చర్చించేందుకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ నేతృత్వంలో అధికారులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎంఆర్ అందించేందుకు గడువు పెంపుపై కూడా మాట్లాడనున్నారు. గత యాసంగితో పోల్చితే 30 లక్షల టన్నులకుపైగా ధాన్యం ఎక్కువగా వచ్చిందని, సీఎంఆర్ అందించేందుకు మరో రెండుమూడు నెలల గడువు ఇవ్వాలని కోరనున్నారు. గత యాసంగిలో మిగిలిపోయిన లక్ష టన్నుల సీఎంఆర్ తీసుకునే విషయంపైనా చర్చించనున్నారు. కాగా, సీఎంఆర్ డెలివరీకి సంబంధించి బిల్లుల విడుదలలో ఎఫ్సీఐ తాత్సారం చేస్తున్నదని పౌరసరఫరాలశాఖ అధికారులు పేర్కొంటున్నారు. సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్తున్నారు.