బెంగళూర్ : కర్నాటకలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టి నాయకత్వంలో పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు. బీజేపీలో నాయకత్వ మార్పు అంశం, అంతర్గత విభేదాల నేపథ్యంలో డీకే ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదని పార్టీ నేతలను ఆయన హెచ్చరించారు. సీఎం పదవి గురించి మాట్లాడవద్దని తాము ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఇతర నేతలను వారించామని డీకే పేర్కొన్నారు.
పార్టీకి హాని చేసే వ్యాఖ్యలు చేయవద్దని కాంగ్రెస్ హైకమాండ్ కూడా జమీర్ కు స్పష్టం చేసిందని చెప్పారు. ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో పాటు ఆయన వర్గంపై అమర్యాదకర వ్యాఖ్యలు చేయడం పార్టీలో కలకలం రేపింది. కుమారస్వామికి వ్యతిరేకంగా జమీర్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని డీకే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఎవరిని ఉద్దేశించి కించపరిచే వ్యాఖ్యలు చేయడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు దూరంగ ఉండాలని ఆయన కోరారు.