హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప సందర్శనకు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (టీఎస్టీడీసీ) ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తున్నది. హైదరాబాద్ నుంచి బస్సులు నడిపేందుకు రెండురకాల ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొదటి ప్యాకేజీలో పర్యాటకులు హైదరాబాద్ నుంచి బయల్దేరి భువనగిరి ఖిల్లాను చూసి అక్కడి నుంచి యాదాద్రి ఆలయ దర్శనం పూర్తి చేసుకొని రామప్పకు వెళ్తారు. రాత్రి అక్కడే లేదా వరంగల్లో బసచేసి మరుసటిరోజు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రెండో ప్యాకేజీలో హైదరాబాద్ నుంచి మొదట నేరుగా రామప్పకు వెళ్లి తిరుగు ప్రయాణంలో యాదాద్రి ఆలయం, భువనగిరి కోట సందర్శించి రాత్రిలోగా హైదరాబాద్కు చేరుకుంటారు. రామప్పకు గతంతో పోలిస్తే విదేశీ పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున వారిని ఆకట్టుకునేలా ప్యాకేజీలను తీసుకురావాలని టూరిజం శాఖ భావిస్తున్నది. రామప్పతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ పర్యటక ప్రదేశాలను కవర్ చేసేలా ఈ ప్యాకేజీలను తీర్చిదిద్దేందుకు కసరత్తు జరుగుతున్నది. అవసరమైతే రామప్ప దగ్గరే వారికి బస ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం పాలంపేటలో ఉన్న 12 గదుల హరితహోటల్ను 100 గదులకు విస్తరించాలని ఆలోచిస్తున్నది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి శ్రీనివాస్గౌడ్లకు త్వరలోనే ప్రతిపాదనలు పంపిస్తామని టీఎస్టీడీసీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా తెలిపారు.