సిటీబ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 18న ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై బల్దియా గంపెడాశలు పెట్టుకున్నది. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జీహెచ్ఎంసీ ప్రస్తుతం ప్రతి నెలా సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకే అష్టకష్టాలు పడుతున్నది. ఏటీకేడు ఆదాయం పెరుగుతున్నప్పటికీ అంతకు మించి ఖర్చులు ఉంటుండడంతో ఖజానాకు భారీగా లోటు ఏర్పడింది. వివిధ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు దాదాపు రూ.1700 కోట్ల బాండ్ల రూపేణా బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకోగా, వీటిపై వడ్డీలకే ఏటా దాదాపు రూ.120 కోట్ల మేర చెల్లిస్తున్నది. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా నిర్దేశిత ఆస్తిపన్ను లక్ష్యం రూ.1900 కోట్లు చేరడం కష్టసాధ్యంగా మారింది. వరుస ఎన్నికలు, కరోనా పరిస్థితులతో దాదాపు రూ.300 కోట్ల మేర ఈ సారి లోటు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కేటాయించే బడ్జెట్పై భారీ ఆశలు పెట్టుకున్నది.
ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్థి పథకం), సమగ్ర రోడ్ల నిర్వహణ పథకం పనులకు భారీగా అప్పులు చేయడంతో వడ్డీలు, అసలు వాయిదాల చెల్లింపులతో తేరుకోవడం కష్టమవుతోంది. డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్ బిల్లులు రూ.300 కోట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డెవలప్మెంట్ వర్క్స్ పేరిట దాదాపు రూ.2300 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఇందులో నాలాల ఆధునీకరణ, ఇతర పనులకు రూ.170 కోట్లు, భూముల అభివృద్ధి పనులకు రూ. 445 కోట్లు, పచ్చదనం పెంపునకు రూ.560 కోట్లు, ఇతరత్రా పనులకు రూ.296 కోట్లు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మౌలిక వసతుల కల్పన, చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు పరిగణనలోకి తీసుకుని బల్దియాకు భారీ నిధులు కేటాయించాలని అధికారులు కోరుతున్నారు.
గ్రేటర్ ప్రజలకు సమృద్ధిగా నీటి సరఫరాతో పాటు 10 లక్షలకు పైగా వినియోగదారుల్లో సుమారు 97 శాతం మందికి నెలకు 20కేఎల్ ఉచిత తాగు నీటి సరఫరా పథకాన్ని జలమండలి అమలు చేస్తున్నది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా సంస్థ ఇందుకు తగ్గట్టుగా తాగు, మురుగునీటి డిమాండ్కు అనుగుణంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రూ.12 వేల కోట్లతో సమగ్ర సివరేజీ మాస్టర్ ప్లాన్కు రూపకల్పన చేసింది. దాదాపు నూతనంగా 56 మురుగునీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే తొలుత సుమారు రూ.1100 కోట్లతో 17 చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి అధికారులు మార్గం సుగమమం చేశారు. రూ.4770 కోట్లతో కేశవాపూర్లో భారీ స్టోరేజీ రిజర్వాయర్, రింగు మెయిన్ పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులకు గానూ రూ.2500 కోట్లు, హడ్కో, కృష్ణా, గోదావరి పథకం, రుణాలకు గానూ రూ.1400 కోట్లు, పవర్ టారిఫ్, ఉచిత తాగునీటి పథకానికి రూ.1600 కోట్లు అవసరమని ప్రభుత్వానికి జలమండలి ప్రతిపాదనలు సమర్పించింది. భారీ పథకాలు కార్యరూపంలోకి తీసుకువచ్చే క్రమంలో ప్రభుత్వ కేటాయింపులపై జలమండలి ఎన్నో ఆశలు పెట్టుకుంది.
వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు ప్రత్యేక నిధులు కేటాయించాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టు నిర్మాణం కోసం జపాన్కు చెందిన ఆర్థిక సంస్థ జైకా నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు రూ. 478 కోట్లు, అదేవిధంగా మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) కోసం మరో రూ.200 కోట్లు కేటాయించాలని కోరామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. నగరాభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తున్న హెచ్ఎండీఏకు పెద్ద మొత్తంలో నిధుల అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తే అభివృద్ధి పనులు చేపట్టడంతో పాటు ఆర్థిక భారం తగ్గుతుందని అధికారులు అంటున్నారు.