తిరువనంతపురం : అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను తీవ్రతరంకావడంతో కేరళలో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మలప్పురం, కోజికోడ్, కన్నూర్, వయనాడ్, కాసర్గోడ్తో సహా ఉత్తర జిల్లాలో 20 సెంటీమీటర్ల కంటే భారీ వర్షాపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, ఇడుక్కి, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిసూర్ల్లో ఆరెంజ్ అలర్ట్, తిరువనంతపురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది. కోజికోడ్ జిల్లాలోని వడకర గ్రామంలో వంద కుటుంబాలకు 310 మందితో పాటు లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. నిరంతరాయంగా కురుస్తున్న వర్షంతో కాసరగోడ్లో అలలు ఎగిపడుతున్నాయి. చెరంగై తీరానికి సమీపంలో ఇండ్లు మునిగిపోయాయి.
రాష్ట్రంలో కొవిడ్ -19 ప్రోటోకాల్స్ అమలులో ఉన్నందున ప్రస్తుతం సహాయ శిబిరాలు ఏర్పాటు చేయలేదు. దీంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. తౌక్టే తుఫాను ఈ నెల 17-18 మధ్య తీరం దాటుందని భావిస్తుండగా.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ 53 బృందాలను అందుబాటులో ఉంచింది. ఇదిలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో సెంట్రల్ వాటర్ కమిషన్ కేరళ, తమిళనాడుకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో నీటి మట్టం ప్రమాదం, భారీ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. ఉదయం 8 గంటల వరకు మణిమల, కేరళలోని అచన్కోవిల్, తమిళనాడులోని కొడయార్ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఈ మూడు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయని హెచ్చరించింది.