హైదరాబాద్ సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు ప్రభుత్వం స్టైపెండ్ పెంచింది. వారికి స్టైపెండ్ను 15 శాతం పెంచుతూ వైద్యారోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్యులు, వారి కుటుంబసభ్యులకు వైద్యసేవల కోసం నిమ్స్ దవాఖానలో ప్రత్యేక వార్డును ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. దాంతో జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన విరమించి విధుల్లో చేరారు. గురువారం ప్రభుత్వంతో జూడాలు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. తమ డిమాండ్లపై వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డితో జూడాలు జరిపిన చర్చలు ఫలించినట్టు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ వెల్లడించింది. తమ డిమాండ్లను నెరవేర్చినందుకు జూడాల అసోసియేషన్ సీఎం కేసీఆర్తో పాటు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపింది.
15 శాతం ైస్టెపెండ్ పెంపు
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టెపెండ్ను 15 శాతం ైపెంచుతూ వైద్యారోగ్యశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం రూ.70 వేలు ైస్టెపెండ్ వస్తుండగా ఇకపై రూ.85,500 వస్తుందని తెలిపింది. తాజా నిర్ణయంతో ఒక్కొక్కరికి అదనంగా రూ. 10,500 అందనున్నది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,500 మంది సీనియర్ రెసిడెంట్లు ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో ఖజానాపై ఏటా రూ.21 కోట్ల అదనపు భారం పడనున్నది.
వెంటనే విధుల్లోకి
ప్రభుత్వంతో చర్చలు సఫలమైన నేపథ్యంలో జూడాలు తక్షణమే సమ్మెను విరమించాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ)అధ్యక్షుడు పల్లం ప్రవీణ్, కార్యదర్శి రచ్చ రఘు, సభ్యులు శేఖర్లుకోరారు. కాగా, తమ వల్ల ఇబ్బందులకు గురైనప్పటికీ తమ డిమాండ్లకు మద్దతు తెలిపిన ప్రజలు, రోగులు, వారి కుటుంబసభ్యులకు జూడాలు క్షమాపణలు తెలిపారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెన్సీలకు ైస్టెపెండ్ పెంచడం, వైద్యులు, వారి కుటుంబసభ్యులకు నిమ్స్లో ప్రత్యేక పడకలు కేటాయించడం తదితర డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం సంతోషకరమన్నారు. విధి నిర్వహణలో కరోనాబారిన పడి మృతిచెందిన వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చేసిన డిమాండ్కు ప్రత్యామ్నాయ అంశాన్ని సీఎం కేసీఆర్తో చర్చిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారని తెలిపారు. తమ డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందిస్తారనే పూర్తి నమ్మకం ఉన్నదని పేర్కొన్నారు. రోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ గురువారం రాత్రి 9 గంటల నుంచే విధుల్లో చేరుతున్నట్టు జూడాలు ప్రకటించారు.
ఊపిరి పీల్చుకున్న రోగులు:
జూడాలు సమ్మె విరమించడంతో రోగులు, వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గత రెండురోజులుగా జూడాల సమ్మెతో ఎదురైన కొన్ని ఇబ్బందులు సమ్మె విరమణతో తొలగిపోయాయి. గురువారం రాత్రి 9 గంటలకు జూడాలు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరడంతో అన్నిరకాల వైద్యసేవలు ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగు తున్నాయి.
వైద్యులకు బెడ్ కోసం ప్రత్యేక పోర్టల్
ప్రభుత్వంతో చర్చలు ఫలించిన సందర్భంగా జూడా అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ మణికిరణ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైద్యులు, వారి కుటంబసభ్యుల చికిత్స కోసం నిమ్స్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. విధినిర్వహణలో ఉన్న వైద్యులు తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు వారికి నిమ్స్ లో వెంటనే బెడ్ను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇందుకు నిమ్స్లో ఒక ప్రత్యేకాధికారితోపాటు జూడాలు ఎంపికచేసిన మరో అధికారిని నియమిస్తామని తెలిపిందని అన్నారు. వైద్యులకు బెడ్ కోసం ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చారని చెప్పారు. అనారోగ్యానికి గురైన వైద్యుడు సదరు పోర్టల్లో సంప్రదిస్తే నిమ్స్లో నియమితులయ్యే ప్రత్యేక అధికారులు సదరు వైద్యుడికి బెడ్ కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ సంవత్సరం నుంచి రావల్సిన ఎరియర్స్ కూడా ఇచ్చేందుకు అధికారులు అంగీకరించినగట్టు తెలిపారు.