హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాబోయే రోజుల్లో రాష్ట్ర జనాభాలో సగానికిపైగా పట్టణాల్లోనే నివసిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ప్రతి పట్టణానికీ ఒక మాస్టర్ప్లాన్ రూపొందించేందుకు మున్సిపల్శాఖ కసరత్తు చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే 44శాతం జనాభా పట్టణాల్లో జీవిస్తున్నది. నీతి అయోగ్ అంచనాల ప్రకారం వేగంగా పట్టణీకరణ చెందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ముందున్నది. పెరుగుతున్న పట్ట ణ జనాభా అవసరాలకు అనుగుణంగా మె రుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా మాస్టర్ప్లాన్పై అధికారులు దృష్టిసారిస్తున్నారు. ప్రతి పట్టణ స్థానిక సంస్థకు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) ఆధారిత మ్యాప్ను రూపొందించనున్నారు. ప్రణాళికాబద్ధంగా పట్టణాలను తీర్చదిద్దడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిచడంతోపాటు ప్రభుత్వ పాలన కూడా సులువు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం కొన్ని పట్టణ స్థానికసంస్థలకు, పట్టణాభివృద్ధి సంస్థలకు మాత్రమే మాస్టర్ప్లాన్లు ఉన్నాయి. నూతన మున్సిపల్ చట్టం ద్వారా అనేక గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయ్యాయి. మరికొన్ని గ్రామాలు సమీప మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ప్లాన్పై కసరత్తు చేస్తున్నారు. విశాలమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్కులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, ఎఫ్ఎస్టీపీలు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల ఏర్పాటు ఇలాంటి అవసరాలన్నీ తీర్చేలా మాస్టర్ప్లాన్ను రూపొందించనున్నారు.
జీఐఎస్ మ్యాప్ల రూపకల్పన
ప్రతి పట్టణానికి మాస్టర్ప్లాన్తోపాటు ప్రతి పట్టణ స్థానికసంస్థకు జీఐఎస్ ఆధారిత మ్యాప్ను రూపొందించనున్నారు. దీంతో గృహ, వాణిజ్య నిర్మాణాలకు సంబంధించిన వ్యవహారాల్లో పారదర్శకత పెరుగుతుంది. వెబ్సైట్లో ఇంటి నంబర్ను ఎంటర్ చేయగానే ఆ ఇంటి ఫొటో, నిర్మాణ అనుమతులు, విస్తీర్ణం, ఆస్తిపన్ను ఇలా అన్ని అంశాలపై సమగ్ర సమాచారం ప్రత్యక్షమవుతుంది. దీంతో అవినీతికి అస్కారం లేకుండా పన్నుల వ్యవస్థ పనిచేస్తుందని భావిస్తున్నారు. పట్టణ స్థానికసంస్థలకు ఆదాయం పెరుగుతుంది. రాష్ట్రంలో 20.45 లక్షల ఇండ్లు ఉండగా ఇప్పటికే ఐదు లక్షలకుపైగా ఇండ్ల వివరాలను భువన్యాప్లో నమోదుచేసే ప్రక్రియ కొనసాగుతున్నది. మండల కేంద్రాల అభివృద్ధికి ఇండికేటివ్ ల్యాండ్ యూజ్ప్లాన్(ఐఎల్యూబీ) విధానంలో ప్రణాళిక రూపొందించాలని డీటీసీపీ అధికారులకు మున్సిపల్శాఖ సూచించింది.