రేగుంటలో బాల్క సురేశ్ చిత్రపటానికి నివాళులు
విషాదంలో ఉన్న సుమన్కు ఆలింగనం
కుటుంబసభ్యులతో ముచ్చట
ధైర్యం చెప్పి తిరుగుపయనం
అంతకుముందు కలెక్టర్ రవితో మాట
లాక్డౌన్, కరోనా పరిస్థితులపై ఆరా
మెట్పల్లి, జూన్ 9 : తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయ ఓదార్పునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక బస్సులో బయలు దేరి 3.35గంటలకు రేగుంట (మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డు)లోని ఆయన నివాస గృహానికి చేరుకున్నారు. తనకు స్వాగతం పలికేందుకు ఎదురుగా వచ్చిన సుమన్ను ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇంట్లోకి వెళ్లి బాల్క సురేశ్ చిత్రపటానికి నివాళులర్పించారు. సుమన్తోపాటు ఆయన కుటుంబసభ్యులనూ పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఓ పదిహేను నిమిషాలు ముచ్చటించి వారిలో ఆత్మవిశ్వాసం నింపి, తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బాల్క సురేశ్ గత నెల 28న అనారోగ్యంతో చనిపోయారు. తండ్రి మరణంతో విషాదంలో ఉన్న బాల్క సుమన్తోపాటు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం జగిత్యాల జిల్లా మెట్పల్లికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో రోడ్డుమార్గాన చేరుకున్న ఆయన, నేరుగా రేగుంట (మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డు)లో సుమన్ నివాసానికి వెళ్లారు. విప్ సుమన్తోపాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, కలెక్టర్ రవి, పలువురు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. వాహనం నుంచి దిగగానే స్వాగతం పలికేందుకు ఎదురుగా వచ్చిన సుమన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇంట్లోకి వెళ్లి సురేశ్ చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులర్పించారు. సుమన్తోపాటు కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. సాయంత్రం 4.05 గంటలకు తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.
లాక్డౌన్, కరోనా పరిస్థితులపై ఆరా
హైదరాబాద్ బయలు దేరేముందు కొన్ని నిమిషాలు జిల్లా కలెక్టర్ గుగులోత్ రవితో మాట్లాడారు. జిల్లాలో కరోనా పరిస్థితులు, నివారణ జాగ్రత్తలు, వైద్య సేవలపై ఆరా తీశారు. లాక్డౌన్తో కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని సీఎం కేసీఆర్కు కలెక్టర్ వివరించారు. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నామని చెప్పారు.
పరామర్శించిన ప్రజాప్రతినిధులు..
విప్ బాల్క సుమన్ను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్నేతకాని, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల జడ్పీ అధ్యక్షులు దావ వసంత, పుట్ట మధు, నల్లాల భాగ్యలక్ష్మి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం, ఆర్మూర్, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సంజయ్కుమార్, రవిశంకర్, దాసరి మనోహర్రెడ్డి, కోరుకంటి చందర్, ఆశన్నగారి జీవన్రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశం గౌడ్, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఈద శంకర్ రెడ్డి, పునుగోటి శ్రీనివాసరావు పరామర్శించారు. సురేశ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఎమ్మె ల్సీ కవిత భర్త అనిల్ రావు కూడా సుమన్ను పరామర్శించారు.
భారీ పోలీస్ బందోబస్తు..
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. రోడ్డు మార్గాన సీఎం రాగా, మెట్పల్లి నుంచి గోధూర్, రేగుంట దారిలో అడుగడుగునా పోలీస్ పహారా ఏర్పాటు చేశారు. ఐజీ నాగిరెడ్డి, కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డి, జగిత్యాల ఎస్పీ సింధూశర్మ, ఇంటెలిజెన్స్ ఎస్పీ రాజ మహేంద్ర నాయక్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జగిత్యాల, నిర్మల్ జిల్లాలతోపాటు కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు.