13 వేల సిబ్బందికి పీపీఈ కిట్లు
మున్సిపల్ సిబ్బందిలో 95% మందికి టీకా
సీడీఎంఏ సత్యనారాయణ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పారిశుద్ధ్యంపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతున్నది. వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించడానికి మున్సిపల్శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,625 వార్డుల్లో శానిటైజేషన్ పూర్తయింది. 2,854 జనసమర్థ ప్రాంతాల్లో శానిటేషన్ ఇంటెన్సివ్ డిస్న్పెక్షన్ డ్రైవ్ పూర్తిచేసినట్టు సీడీఎంఏ సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ ప్రజారోగ్య సిబ్బంది కొవిడ్ బారిన పడకుండా వారికి పీపీఈ కిట్లు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్రంలో 20,792 మంది ప్రజాఆరోగ్య సిబ్బంది ఉండగా.. 13,612 మందికి పీపీఈ కిట్లను అందించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 1.01 లక్షల లీటర్ల సోడియం హైపోక్లోరైడ్, 1,72,804 కిలోల బ్లీచింగ్ పౌడర్ను అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్, మున్సిపల్శాఖ సిబ్బందిలో 95 శాతం మంది టీకా వేసుకున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో 30,269 మంది ఉండగా.. ఇప్పటివరకు 28,791 మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇంకా 1,478 మందికి వ్యాక్సిన్ చేయించాల్సి ఉన్నది.