జమ్మికుంట, ఆగస్టు 26: ఊసరవెల్లి.. అవసరానికి అనుగుణంగా రంగులు మార్చే ప్రాణి. హుజూరాబాద్లో బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇప్పుడు ఊసరవెల్లి మించిపోయారు. తన ఎన్నికల ప్రచార రథాలకు ప్రాంతాలను బట్టి రంగులు మార్చి తన అసలు రంగు ను బయటపెట్టుకొన్నారు. దళితవాడల్లో ఒకరంగు రథం.. ఇతర ప్రాంతాల్లో మరో రంగుతో రథాన్ని తిప్పుతున్నారు. దళితవాడల్లో తిరుగుతున్న వాహనానికి నీలంరంగు వేయించి, దానిపై అంబేద్కర్, పూలే, జగ్జీవన్రాం వంటి దార్శనికుల ఫొటోలతో అలంకరించారు. ఇతర ప్రాంతాల్లో తిరిగే వాహనానికి కాషాయరంగు వేశారు. దీనిపై ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ నాయకుల ఫొటోలను అంటించారు. ఈ రథంపై అంబేద్కర్తోసహా ఏ మహనీయుడి ఫొటో లేదు.
దళితబంధుపై విషం
దళితుల జీవితాల్లో సమూల మార్పులు తెచ్చే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకంపై విషం చిమ్మేందుకు ఈటల ప్రత్యేక ప్రచార బృందాలనే ఏర్పాటుచేశారు. నాలుగు వాహనాల్లో ప్రత్యేక బృందాలను కాలనీల్లో తిప్పుతున్నారు. ప్రతి గ్రామంలో నలుగురైదుగురికి మాత్రమే దళితబంధు వస్తుందని దళిత కాలనీల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయిస్తున్నారు. ఈటల తీరుపై దళితులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. బుధవారం రాత్రి జమ్మికుంట మండలంలోని శంభునిపల్లిలో బీజేపీ ప్రచార వాహనాన్ని అడ్డుకొని వెనుకకు పంపారు. దళితవాడల బయట తిరుగుతున్న ప్రచార రథంపై అంబేద్కర్ ఫొటోను ఎందుకు పెట్టలేదని నిలదీస్తున్నారు. దళితులంటే ఈటలకు ఇంత చిన్నచూపా? అని మండిపడుతున్నారు.
మహనీయులను అవమానిస్తున్నారు
బీజేపీ అది మతతత్వ పార్టీ. ఇప్పుడు ఓట్ల కోసమే తిరుగుతున్నరు. మేం వద్దనం. దళితులను మోసం చేసేందుకు వాహనాలకు నీలం రంగు వేస్తవా ఈటలా? ఇతర ప్రాంతాల్లో తిరిగే ప్రచార రథంపై అంబేద్కర్ బొమ్మ ఎందుకు పెట్టలేదు? మా మీద ఇంత చిన్నచూపా? దళితబంధుపై అసత్య ప్రచారాలు ఎందుకు చేస్తున్నరు? నువ్వు ఏం జేత్తవో చెప్పవు.. నీ పార్టీ ఏం జేత్తదో చెప్పది. కానీ, ఇచ్చే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిడ్తరు. దళితబంధు రాదని అబద్ధం చెప్తరు. జాగ్రత్త. ఇట్లాంటి ప్రచారాలు మానుకోండి. దళితబంధు అందరికీ వత్తది.
ఈటల దళిత ద్రోహి..
ఈటల దళిత ద్రోహి. దళిత వాడల్లో ప్రచారానికి ఆయన అనర్హుడు. దళితుల ఓట్ల కోసం కుయుక్తులు పన్నుతున్నడు. దళిత వ్యతిరేక పార్టీలో చేరి ఓట్లెలా అడుగుతడు? మంత్రిగా ఉన్నప్పుడేం జేసిండు? ఇప్పుడేంజేత్తడు? దళితులకు అణగతొక్కిండు. దళితుల అభ్యున్నతిని ఓర్వలేనోడు. దొంగలకు సద్దికట్టిండు. పనిజేసినోన్ని దూరంగొట్టిండు. దళిత బిడ్డలను దగ్గరకు రానియ్యలే. ఇప్పుడు రంగులు మార్చి దళిత వాడలల్ల తిరుగితే ఊకుంటమా? దళిత బంధును అవమానిస్తే ఊరుకోం. తగిన గుణపాఠం చెప్తం.