గుంటూరు : గుంటూరు జిల్లా నరసరావు పేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండపై రేపు శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. త్రికూటేశ్వరస్వామికి మంత్రి ఆనవాయితీగా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కోటప్పకొండకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 750 బస్సులు నడుపనుంది. మహాశివరాత్రి వచ్చిందంటే కోటప్పకొండ తిరునాళ్ల గురించి మాట్లాడాల్సిందే.. ప్రభల వైభవం గురించి చెప్పుకోవాల్సిందే.
శివరాత్రికి నెలరోజుల ముందు నుంచే ప్రభల నిర్మాణం మొదలవుతుంది. కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ప్రభను కోటప్పకొండకు తరలిస్తారు. ఎండ్ల బండిపై తీసుకొచ్చే సమయంలో ప్రభ ఒరిగిపోవడం, ఇరుసులు విరిగిపోవడం వంటివి ఎదురైనా వెనకడుగు వేయరు. ప్రభకు ఇరువైపులా తాళ్లు కట్టి పడిపోకుండా నియంత్రిస్తారు. విద్యుద్దీపాల నడుమ వెలిగిపోతున్న ప్రభలు.. పండగ నాటికి కోటప్పకొండ పాదాల చెంతకు చేరుకుంటాయి. ఆటపాటలతో పండగ శోభ పెరుగుతుంది. కోటయ్యస్వామిని దర్శించుకొని.. రాత్రంతా జాగరణ చేసి తిరిగి ప్రభతోపాటు గ్రామానికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తోంది.