హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఎంవీ సౌందర్రాజన్ను సంప్రదాయ సంరక్షణ దీపం బిరుదు వరించింది. సంప్రదాయ పరిరక్షణకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా శ్రీరంగక్షేత్రంలోని పండరీకపురం అడవన్ ఆశ్రమం తరఫున గోపాలదేశిక మహాదేశికన్ స్వామి వారి శతజయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ బిరుదును ప్రదానం చేశారు. పండరీపురం అడవన్ ఆశ్రమం ప్రస్తుత పీఠాధిపతి శ్రీనివాస మహాదేశికస్ ద్వారా బిరుదు పత్రం, శాలువా, రూ.4వేలు నగదు పురస్కారాన్ని కొరియర్లో పంపినట్టు శుక్రవారం సౌందర్రాజన్ నమస్తే తెలంగాణకు తెలిపారు. సౌందర్రాజన్ ఎంకామ్, ఎల్ఎల్బీ పట్టభద్రుడు, కామర్స్లో డాక్టరేట్ పొందారు. చిలుకూరు బాలాజీ దేవాలయం కేంద్రంగా దేవాలయాల పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిస్తూ దేవాలయాలపై ఆయా ప్రభుత్వాల జోక్యాన్ని ఖండిస్తూ, ఎదిరిస్తూ దేవాదాయచట్ట సవరణకు కృషి చేశారు.