కొన్నప్పటినుంచి ఇంటికి చేరేదాకా లైవ్ఫొటోలు
లబ్ధిదారులకు సమీపంలోని రాష్ర్టాల్లో కొనుగోళ్లు
రాష్ర్టాలవారీగా సేకరణపై అధికారుల కసరత్తు
హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రెండోవిడత గొర్రెల పంపిణీని మరింత పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంపిణీలో అక్రమాలు జరుగకుండా, నిత్యం పర్యవేక్షణకు ప్రత్యేకంగా యాప్ను రూపొందించింది. రెండోవిడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలపడంతో పశుసంవర్థకశాఖ అధికారులు కార్యాచరణ చేపట్టారు. మొత్తం గొర్రెలు (21) లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా యాప్లో నమోదుతో గొర్రెల సంఖ్యలో అవకతవకలు జరగకుండా, లబ్ధిదారులకు పంపిణీ చేయకుండానే చేసినట్టు రికార్డులో నమోదుచేసే అవకాశం ఉండదు. యాప్లో లైవ్ లొకేషన్ ఫొటోఫీచర్ను ఏర్పాటుచేశారు. కొనుగోళ్ల వద్ద, గొర్రెలను లోడ్చేసే సమయంలో, ఇక్కడ అన్లోడింగ్తోపాటు లబ్ధిదారులకు పంపిణీ చేసే సమయంలో ఫొటోలు తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. యాప్ లైవ్ఫొటోలను మాత్ర మే స్వీకరిస్తుంది. నాణ్యమైన గొర్రెలు ఇవ్వడం లేదని, సంఖ్యను తగ్గిస్తున్నారంటూ లబ్ధిదారుల నుంచి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రెండోవిడతలో వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఆ రాష్ర్టాల నుంచి గొర్రెల సేకరణ
రెండోవిడతలో భాగంగా సుమారు 3.80 లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో యూనిట్కు 21 గొర్రెల చొప్పున 3.80 యూనిట్లుకుగానూ సు మారు 80 లక్షల గొర్రెల సేకరణపై అధికారులు దృష్టిసారించారు. లబ్ధిదారులు ఎక్కువగా కొనేందుకు ఇష్టపడే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఎక్కువదూరం ప్రయాణంతో గొర్రెలు అస్వస్థతకు గురవుతున్న నేపథ్యంలో ఆయా రాష్ర్టాల నుంచి సేకరించిన గొర్రెలను సమీపంలోని జిల్లాల లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇతర రాష్ర్టాల్లో గొర్రెల కొనుగోళ్ల కోసం వెటర్నరీ డాక్టర్లను కాకుండా ఈసారి ఏడీలను పంపించాలని అధికారులు నిర్ణయించారు. వెటర్నరీ డాక్టర్లు గొర్రెల కొనుగోళ్ల కోసం 15 రోజుల నుంచి నెలపాటు ఇతర రాష్ర్టాల్లోనే ఉండాల్సి రావడంతో స్థానికంగా పశువులకు వైద్యసేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.