హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఐదురోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర, ఏపీలో కూడా రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. 24 గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్యదిశగా ప్రయాణించి ఒడిశామీదుగా వెళ్లే అవకాశం ఉన్నదని, పశ్చిమదిశగా బలమైన గాలులు రాష్ట్రంలోకి వస్తున్నాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాగల నాలుగు రోజులు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అంచనావేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర, తూర్పు జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీనుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని హెచ్చరించింది. గత 24 గంటల్లో వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు మినహా రాష్ట్రమంతా వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాకాల ప్రారంభంలోనే సాధారణం కంటే 123 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ వెల్లడించింది.