సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెంగాణ): రోడ్డు ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇంటిని పోషించే పెద్ద దిక్కును మృత్యువు కబళిస్తుండటంతో ఆ కుటుంబాలకు పోషణ భారమవుతున్నది. జీవనాన్ని ముందుకు సాగించడం సవాలుగా మారుతున్నది. ఈ కన్నీటి గాదల వెనుక వాహనదారుల నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తున్నది. నిబంధనలు పాటించకపోవడంతో అయినవాళ్లకు దూరమవుతున్నారు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. చాలా మందిలో మార్పు రావడం లేదు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జనవరి నుంచి మే 31 వరకు జరిగిన రోడ్ యాక్సిడెంట్లపై విశ్లేషణ జరిపారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారు 338 మంది మృతి చెందగా, వారిలో 179 మంది 25 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వయసు వారు ఉంటే.. ఇందులో అత్యధికంగా హెల్మెట్లు ధరించకుండా వాహనాలు నడిపించి.. మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. మృతులంతా ఉద్యోగాలు చేస్తూ ..కుటుంబాలను పోషించుకుంటున్న వారే ఉండటం బాధాకరం.
నిబంధనలు పాటించక.. .
కుటుంబ పోషణకు ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లోని పరిస్థితులు, ఉద్యోగంలో ఉండే ఒత్తిడి.. ఇలా కొన్ని కారణాల వల్ల మందుకు అలవాటుపడుతున్నారు. నిబంధనలు పూర్తిగా విస్మరిస్తున్నారు. డ్యూటీ ముగించుకొని తిరిగి వెళ్లే సమయంలో రిలీఫ్ కోసమని మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారినపడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. కాగా, వాహనదారులు ప్రమాదానికి గురైనప్పుడు హెల్మెట్ ధరించకపోవడం వల్లే తలకు గాయమై.. అధిక రక్తస్రావంతో మరణిస్తున్నారు.
నిర్లక్ష్యంగా నడుపొద్దు..
వాహనాలను నడిపించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. నాణ్యమైన హెల్మెట్లను ధరించాలి. బెల్టులను పెట్టుకుంటేనే రక్షణ ఉంటుంది. వాహనం నడిపించే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. చిన్న నిర్లక్ష్యం ప్రాణాన్ని మింగేస్తుంది. ప్రతి సంఘటనల వెనకాల తీవ్ర విషాదం ఉంటుంది. కుటుంబసభ్యులను దృష్టిలో పెట్టుకోనైనా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి.
-విజయ్కుమార్, ట్రాఫిక్ డీసీపీ సైబరాబాద్