‘ దళితవాడ ప్రగతి జాడ నడిపించగ వచ్చెనో.. ముఖ్యమంత్రి కేసీయారు
దళితబంధు పథకముతో ఆత్మబంధువయ్యెనో.. ముఖ్యమంత్రి కేసీయారు
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాట కట్టి చిందు వేసిన కళాకారులు ఇప్పుడు దళితబంధు కోసం గొంతు సవరించుకుంటున్నారు. కొత్త పాటలతో ధూంధాంకు సిద్ధమవుతున్నారు. దళిత బంధుపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రచారం కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి పాటలతో కదం తొక్కుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్న దళితబంధు పథకాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుళ్లేందుకు దరువులేస్తున్నది. పథకం ఉద్దేశం, లక్ష్యాన్ని ఊరూ.. వాడా.. మారుమోగించేందుకు 8 పాటలను సిద్ధంచేసింది.
దళితబంధుపై సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడంలో భాగంగా రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కళాకారులతో సీఎం కేసీఆర్ ఇటీవల సమావేశమయ్యారు. పథకం ఉద్దేశాన్ని వివరిస్తూ ఎలాంటి పాటలు రాయాలో దిశానిర్దేశం చేశారు. ఇప్పటివరకు కళాకారులు రాసిన పాటలను పరిశీలించి, స్వయంగా పాటలను రాసే పనిలో సీఎం కేసీఆర్ నిమగ్నమయ్యారు. ఎమ్మెల్సీ, ప్రముఖ రచయిత గోరటి వెంకన్న, సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి, కవి, రచయిత దేశపతి శ్రీనివాస్, రచయితలు, కళాకారులు కోదాడి శ్రీను, అంబటి వెంకన్న, మిట్టపల్లి సురేందర్, అభినయ శ్రీనివాస్, బోడ చంద్రప్రకాశ్, మానుకోట ప్రసాద్, ఏకే బిక్షపతి, బాబు, శివ సీఎంతో సమావేశమైన వారిలో ఉన్నారు.
దళితబంధు గీతాలపై రసమయి బాలకిషన్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు, పర్యవేక్షణలో 8 పాటలను పూర్తిచేశాం. త్వరలోనే ఈ పాటలకు కళారూపం ఇస్తాం. 16వ తేదీన హుజూరాబాద్ వేదికపై ఆడియో, వీడియో సాంగ్స్ విడుదల చేస్తాం’ అని చెప్పారు. ‘తెలంగాణ కోసం ఉద్యమంలో ఎలాగైతే ధూంధాం చేశామో… అణగారిన వర్గాల శ్రేయస్సు కోసం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయసాధన కోసం దళితబంధుపైనా అదేస్థాయిలో ధూంధాం చేస్తాం’ అన్నారు.
పేదలకు డైరెక్ట్గా రూ.10 లక్షలు ఇచ్చుడు మామూలు విషయం కాదు. ఆ పది లక్షలను ఎట్లా ఉపయోగించుకోవాలె.. వాటితో ఏంచేస్తే జీవితాలు బాగుపడుతయ్ అని చెప్పుడం కళాకారులుగా మా బాధ్యత.
–గడ్డం కళావతి, సాంస్కృతిక సారథి కళాకారిణి
దళిత కుటుంబాల్లో వెలుగునింపే మహత్తర కార్యక్రమం దళితబంధు. అంబేద్కర్ గురించి చదువుకున్న మేం ఇవాళ సీఎం కేసీఆర్లో మరో అంబేద్కర్ను చూసుకుంటున్నాం. ఎస్సీ సబ్ప్లాన్ కంటే ఇది వేయిరెట్లు మంచి కార్యక్రమం.
–యాకూబ్, సాంస్కృతిక సారథి కళాకారుడు