సూర్యాపేట: జిల్లాలోని పెన్పహాడ్ మండలంలో దారుణం జరిగింది. మందలించాడని కన్నతండ్రినే హత్య చేశాడో సుపుత్రుడు. మండలంలోని నారాయణ గూడానికి చెందిన నంద్యాల అంజిరెడ్డి, సమరసింహారెడ్డి తండ్రీకొడుకులు. గత కొన్ని రోజులుగా సమరసింహారెడ్డి జులాయిగా తిరుగుతున్నాడు. దీంతో అంజిరెడ్డి నిన్న రాత్రి తన కొడుకును మందలించాడు. తండ్రి మాటలకు కోపోద్రిక్తుడైన సమరసింహారెడ్డి శుక్రవారం అర్థరాత్రి అతన్ని కిరాతకంగా హతమార్చాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి