హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తయారవుతున్న హస్తకళాకృతులు, బొమ్మలకు ఈ-మార్కెట్ ప్లేస్ను తయారుచేయడమే లక్ష్యంగా ఈ-గోల్కొండ వెబ్ పోర్టల్ తీసుకొచ్చామని పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తెలంగాణ చేనేత, జౌళిశాఖ ఆధీనంలోని హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ-గోల్కొండ వెబ్ పోర్టల్ను గురువారం ప్రగతిభవన్లో ఆయన ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని ఏ ప్రాంతానికైనా మన కళాకృతులను చేర్చేందుకు వీలున్నది. త్వరలో కేంద్ర ప్రభుత్వ అనుమతులు పొంది ప్రపంచంలో ఎక్కడికైనా పంపేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పోర్టల్ ద్వారా రాష్ట్రంలో తయారవుతున్న అద్భుతమైన సంప్రదాయ కళాకృతులను, చేతి బొమ్మలను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసే వీలుంటుందని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న అనేక ప్రైవేటు ఈ-కామర్స్ వెబ్సైట్ల కంటే అత్యుత్తమ సౌకర్యాలు ఇందులో ఉన్నట్టు తెలిపారు. ఈ-గోల్కొండ పోర్టల్ ద్వారా విక్రయానికి ఉంచిన కళాకృతులను సునిశితంగా పరిశీలించేందుకు 3డీ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. మొబైల్ ఫోన్ల ద్వారా కూడా ఆపరేట్ చేసేలా వెబ్సైట్ను రూపొందించామని పేర్కొన్నారు. https://golkondashop.telangana.gov.in/ లింకు ద్వారా ప్రజలు తమకు నచ్చిన కళాకృతులను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న అద్భుత హస్తకళలను కొనసాగించేందుకు టెక్స్టైల్ శాఖ తరఫున అవసరమైన నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ వంటి సేవలతోపాటు ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని కళాకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి హస్తకళల అభివృద్ధి సంస్థ బలోపేతానికి కృషి చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్కుమార్, టెక్స్టైల్ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యార్ తదితరులు పాల్గొన్నారు.