నల్గొండ : నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పటిష్ఠ నిఘా పెట్టినట్లు డీఐజీ రంగనాథ్ తెలిపారు. ఈ నెల 17న జరుగనున్న పోలింగ్కు బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. దాదాపు 2,500 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారని ఆయన వెల్లడించారు. బుధవారం నాగార్జున సాగర్ హిల్కాలనీ పోలీస్ స్టేషన్లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘నియోజవర్గంలోని పోలింగ్ కేంద్రాలను 39 రూట్లుగా విభజించామని తెలిపారు.
మొత్తం 346 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 108 సమస్యాత్మకమైనవిగా గుర్తించామని వెల్లడించారు. చెక్పోస్టుల వద్ద ఇప్పటివరకు రూ.32 లక్షల నగదు.. 3 లక్షల 50 వేల విలువైన మద్యo స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
‘‘ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టవద్దు. ఎన్నికల అబ్జార్వర్ అనుమతి లేకుండా త్రిపురారం మండల కేంద్రంలోని కల్యాణ మండపంలో ఓ రాజకీయ పార్టీ సమావేశం నిర్వహించగా సీజ్ చేశాం.
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తాం. వివిధ పార్టీలకు చెందిన 2,500 మందిని బైండోవర్ చేశాం.
ఎన్నికల పోలీస్ పరిశీలకుడిగా ఉత్తరాఖండ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిని కేటాయించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరూ సహకరించాలి.
ప్రజలు స్వచ్ఛందoగా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి. ప్రతిఒక్కరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలి’ అని డీఐజీ రంగనాథ్ కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి