హైదరాబాద్ : పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అయ్యాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఈ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నిర్వహించిన పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమం లో భాగంగా 6 లక్షల 43 రోడ్లను తుడిచి పరిశుభ్రం చేశారన్నారు. 3 లక్షల 52 వేల డ్రైనేజీ లను పూడిక తీసి, మురుగునీరు, వాననీరు వెళ్లడానికి ఆటంకం లేకుండా చేసినట్లు వివరాలను వెల్లడించారు.
లక్షా 64 వేల ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల కార్యాలయాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీలు, ఆసుపత్రులను శుభ్రం చేయడం, 51 వేల 215 లోతట్టు ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలలో, బస్ స్టేషన్లలో వాన నీరు, డ్రైనేజీ నీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గతంలో గ్రామాల్లో నిర్మించిన 10 వేల 643 వైకుంఠ ధామాలకు, 10 వేల 542 డంపింగ్ యార్డ్ లకు బయో ఫెన్సింగ్ వేయబడిందని, 26 వేల విద్యుత్ స్తంభాలను, తుప్పుపట్టిన, వంగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చడం, రిపేర్లు చేశామని పేర్కొన్నారు.
కొత్తగా 32 వేల 186 స్ట్రీట్ లైట్ స్తంభాలకు 3 వ వైర్ ను అమర్చడం జరిగిందని, 13 వేల 497 విద్యుత్ మీటర్లు కొత్తగా అమర్చబడ్డాయని దయాకర్ రావు తెలిపారు.
1046 వినియోగించని బావులను పూడ్చి వేయడం తో పాటుగా 3 వేల 909 పని చేయకుండా ఉన్న బోరు బావులను మూసి వేయడం జరిగిందన్నారు. అసంపూర్తిగా ఉన్న 53 వైకుంఠధామాలు, 29 డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. దీనికి తోడుగా 4వ విడత కార్యక్రమంలో పచ్చదనాన్ని పెంపొందించడం లో భాగంగా 98 పల్లె ప్రగతి వనాలను కొత్తగా చేపట్టడం చేపట్టామన్నారు. 535 మండలాలలో బృహత్ పల్లె ప్రగతి వనాలకు కావాల్సిన స్థలాలను గుర్తించడం, ప్రతి ఇంటికి ఆరు మొక్కలు చొప్పున 46 లక్షల 9 వేల ఇండ్లలో నాటడానికి 3 కోట్ల 8 వేల మొక్కలను పంపిణీ చేశామని ఆయన తెలిపారు.
దీనికి తోడుగా రాష్ట్రంలో 17 వేల 453 కిలోమీటర్ల పొడవునా రోడ్లకు ఇరువైపులా 70 లక్షల 23 వేల మొక్కలను అవెన్యూ ప్లాంటేషన్ చేయడం, గృహాల్లోనే కాకుండా ప్రభుత్వ, సామాజిక ప్రదేశాలలో కోటి 16 లక్షల మొక్కలను నాటమని ఆయన తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రగతి కార్యక్రమం అమలును స్వయంగా పరిశీలించడానికి తాను స్వయంగా పదకొండు రోజులపాటు రాష్ట్రంలోని 16 జిల్లాలలో విస్తృతంగా పర్యటించి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సభలలో పాల్గొన్నానని ఆయన తెలిపారు.
మొట్టమొదటిసారిగా 12,769 గ్రామాల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రతి గ్రామంలో వర్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 116 కోట్ల రూపాయల వ్యయంతో 19,472 పల్లె ప్రకృతి వనాల నిర్మాణాన్ని చేపట్టగా, ఇందులో 19,413 (99.63 శాతం) పల్లె ప్రగతి వనాలను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చామని ఆయన తెలిపారు. 12,769 గ్రామ పంచాయతీల్లో 1556 కోట్ల రూపాయల వ్యయంతో 12,769 వైకుంఠధామాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా అందులో భాగంగా ఇప్పటికే 12,432 (94.36%) వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చామని ఆయన తెలిపారు.
వివిధ దశల్లో ఉన్న వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డుల నిర్మాణం వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాల్సిందిగా సంబందిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు గ్రామ అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు