హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): మెట్రో నగరాల్లో అటవీ విస్తీర్ణం వృద్ధిలో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానం సాధించిన నేపథ్యంలో ప్రపంచ పర్యావరణవేత్త ఎరిక్ సోల్హెమ్ శుభాకాంక్షలు తెలిపారు. 2011-2021 మధ్య కాలంలో 4,866 హెక్టార్ల అటవీ విస్తీర్ణం పెరిగిందని, వెల్డన్ తెలంగాణ అండ్ ఇండియా అంటూ శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు.
దీనిపై మంత్రి కేటీఆర్ ( KTR ) స్పందిస్తూ.. హరితహారం క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని, గ్రామాలు, మున్సిపాలిటీలలో పచ్చదనం పెంపుదల కోసం గ్రీన్ బడ్జెట్ కింద నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. హరితహారంలో భాగంగా ఏర్పాటుచేసిన అర్బన్ పార్కులు ప్రకృతి నిలయాలుగా మారాయని పేర్కొన్నారు. ప్రకృతి మధ్య గడిపేందుకు అర్బన్ పార్కులు ఉత్తమ గమ్యస్థానాలుగా మారాయని వివరించారు. అర్బన్ పార్కులకు సంబంధించిన యాప్ లింక్ను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అర్బన్ పార్కుల పూర్తి సమాచారాన్ని చిటికెలో తెలుసుకొనేలా అటవీశాఖ ఈ యాప్ను రూపొందించింది. హెచ్ఎండీఏ, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలోని 39 అర్బన్ ఫారెస్ట్ పార్కుల సమాచారాన్ని యాప్లో పొందుపరిచారు.