హైదరాబాద్ : బహిరంగ ప్రదేశాల్లో ప్రజల దృష్టి మళ్లించి బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న ముగ్గురు మహిళలను నగరంలోని శాలిబండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితులను తుకారాంగేటు మంగర్బస్తీకి చెందిన రూప(31), ఉషా(30), ఉమా హతేగల్లి(23)గా గుర్తించారు. ఈ ముగ్గురు ఓ గ్యాంగ్గా ఏర్పడి ఆటోలు, ప్రజా రవాణా సదుపాయాల్లో ప్రయాణించే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు.
బంగారం, ఇతర విలువైన వస్తువులను దొంగిలించి ఆపై పంచుకునేవారు. ఇటీవల ఓ లెక్చరర్ వెంట సహ ప్రయాణికులుగా వెళ్లి ఆమె బంగారు ఆభరణాలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదుతో శాలిబండ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.