హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల కేసులో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రి, టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నాయకులపై చేసిన వ్యాఖ్యలు, వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్మీడియాలో ఆయన్ను నెటిజన్లు ఓ ఆటాడేసుకొన్నారు. నిలబెట్టి నిలదీసినట్టు పదునైన ప్రశ్నలతో ఈటల ఇజ్జత్ తీసేశారు.
మంత్రి పదవి ఉన్నన్నాళ్లు బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల గురించి పట్టించుకోని, మాట్లాడని ఈటల.. మంత్రి పదవి పోగానే తాను బడుగును, బలహీన వర్గానికి చెందినవాడినని మాట్లాడటంపై రాజు అనే నెటిజన్ ‘నీకు పదవి పోయే సరికి వాగ్దానాలు, కులాలు గుర్తుకొచ్చాయా రాజా??’ అంటూ సూటిగా అడగ్గా., బీజేపీలోకి వెళ్లిపో నీమీద వచ్చిన ఆరోపణలు అబద్ధాలు అయిపోతాయి అంటూ ఫరీద్ మహమ్మద్ అనే వ్యక్తి వ్యంగ్యాస్ర్తాలు సంధించాడు. ప్రగతిభవన్లో బడుగు, బలహీన వర్గాల అధికారులు లేరని విమర్శించిన ఈటలకు విశాల్రెడ్డి అనే నెటిజన్ ‘తెలంగాణ సీఎంవోలో లేరు సరే. మీ ఇంట్లో ఉన్నారా అన్నా బీసీ?.. మీ భార్య జమున రెడ్డి, మీ కొడుకు నితిన్ రెడ్డి, మీ కోడలు కూడా రెడ్డినే.. మీ ఇట్లోనే లేరు కదా అన్నా బీసీలు’ అంటూ చురకలంటించాడు. ఈ కామెంట్ నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతున్నది. రైతుబంధు విషయంలో మాజీమంత్రి చేసిన వ్యాఖ్యలపైనా చెంప ఛెల్లుమనిపించేలా నెటిజన్లు రిైప్లె ఇచ్చారు. వికాస్ రెడ్డి అనే నెటిజన్ ఏకంగా లేఖ రాసినట్టుగానే విమర్శల బాణాలను సంధించారు.
‘నీకు ఇన్ని రోజులు వచ్చిన రైతు బంధు 10 లక్షలు రిటర్న్ ఇచ్చెయ్యి. ఇప్పుడు బీజేపీ డబ్బా కొడుతున్నావ్ కదా.. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు రూ.20 వేల కోట్లు ఇవ్వుమని నీతి ఆయోగ్ చెప్పింది. అవి శాంక్షన్ చేయించు. ఆలోవర్ ఇండియాలో రైతుబంధు రూ.10 వేల చొప్పున ఇప్పించు.. 24 గంటల కరెంటు ఇప్పించు.. ’ అంటూ సూటిగా, ఘాటుగా వ్యాఖ్యానించాడు. బీజేపీలో చేరుతున్నట్టు ఈటల చెప్పటంపై స్పందించిన ప్రభాకర్రెడ్డి అనే నెటిజన్.. ‘రాములవారి సొమ్ము తిన్నోడే రేపటి నుంచి జై శ్రీరాం అంటే ఆ శ్రీరాముడి ఆత్మగౌరవం ఏం కాను..’ అని చేసిన కామెంట్ టాప్లో ట్రెండ్ అవుతున్నది. మరో నెటిజన్ ఈటల చేసిన ఆత్మగౌరవ నినాదంపై మండిపడ్డారు.
‘ఏ జాతీయ పార్టీల కబంధ హస్తాల్లో 6 దశాబ్దాలకుపైగా నా తెలంగాణ నలిగిపోయిందో.. అదే జాతీయ పార్టీల గేటు ముందు నిలబడి ఇయ్యాల అపాయింట్మెంట్ల కోసం ఎదురుచూస్తున్నరు. మీకు ఆత్మగౌరవం అనే పదాన్ని ఉచ్చరించే అర్హత ఉందా అని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’ అంటూ సూటిగా ప్రశ్నించారు. చెవురు వరప్రసాద్ అనే వ్యక్తి .. ‘ఈటల పరిస్థితి ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న ఏరు దాటిన తరువాత బోడి మల్లన్న.. నువ్వు నిజాయితీపరుడు అయితే నువ్వే రాజీనామా చేసి బయటకు వచ్చి ప్రభుత్వంపై పోరాటం చేయాలి. వారు బయటకు నెట్టేశారు కాబట్టి మీరు ఈ విమర్శలు చేస్తున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు.
ఈటల రాజేందర్ చేసిన ప్రతి మాటపై సూదుల్లాంటి ప్రశ్నలతో, తూటాల్లాంటి రిైప్లెలతో సోషల్మీడియాలో నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమదైన శైలిలో ఈటలపై ఈటెల్లాంటి కామెంట్లతో దాడిచేశారు. అధికారం ఉన్నపుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారంటూ, పదవి పోయేసరికి కులాలు గుర్తుకొచ్చాయా? అంటూ నిలదీశారు.