తిరుమల తరహాలో ఏర్పాట్లు
స్మార్ట్ సిటీ టెక్నాలజీపై సమీక్ష
యాదాద్రి, సెప్టెంబర్ 4: తిరుమల తరహాలో యాదాద్రికి వచ్చే భక్తులు క్యూఆర్ కోడ్తో దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తరువాత త్వరలో భక్తులకు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు పటిష్ఠభద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్లమెంట్లో వినియోగించే స్మార్ట్ సిటీ టెక్నాలజీని యాదాద్రిలో ఏర్పాటు చేయనున్నా రు. ఇందులో భాగంగా ఇజ్రాయిల్కు చెందిన సాంకేతికత, కెమె రాలు, లైటింగ్, ఫెన్సింగ్, బాంబు డిటెక్టర్లు, బాంబు స్కానర్లు వినియోగించనున్నారు. యాదాద్రి పరిసర ప్రాంతాల్లో కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను హైదరాబాద్లోని ఈసీఐఎల్కు అప్పగించారు. సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్రావు, ఆలయ ఈవో గీత, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, డీసీపీ నారాయణరెడ్డి తదితరులు శనివారం యాదాద్రి టెంపుల్ సిటీలో ఆలయ భద్రతపై సమీక్షించారు. రాయగిరి నుంచి యాదాద్రి వరకు అధునాతన కెమెరాలను బిగించనున్నట్టు వైటీడీఏ అధికారులు వెల్లడించారు. ఈ కెమెరాల్లో సౌండ్ సిస్టం, వైఫై ఉంటుంది. భక్తులు ఎక్కడైనా ఇబ్బందులు పడితే కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్కు వెంట నే సమాచారం అందేలా చర్యలు చేపట్టనున్నారు. యాదాద్రి కొండచుట్టూ నిర్మిస్తున్న రింగురోడ్డుకు భద్రత నిమిత్తం అధునాతన ఫెన్సింగ్ను ఏర్పాటు చేయనున్నారు. ప్రవేశ ద్వారం వద్ద బాంబు స్కానర్లు అమర్చనున్నారు. కొండపైకి వెళ్లే బస్సులకు స్కానర్లను బిగించనున్నారు. సెంట్రల్ రిసెప్షన్ వద్ద స్కాన్ పూర్తయిన బస్సులను మాత్రమే కొండపైకి అనుమతించనున్నారు. లైటింగ్ ఆన్ ఆఫ్కు సాంకేతికను వినియోగించనున్నారు.