మాదాపూర్, మే 23: ఓ శిశువు పుట్టిన వారానికే కరోనా బారిన పడింది. కిమ్స్లో ప్రత్యేక విధానంతో చికిత్సచేసిన వైద్యులు ఆ చిన్నారి ప్రాణాలు నిలిపారు. ప్రస్తుతం 37 రోజుల ఆ చిన్నారి కరోనాను జయించింది. హైదరాబాద్లోని కూకట్పల్లికి చెందిన బాల మౌనిక 28 వారాల గర్భిణీగా కరోనా లక్షణాలతో బాధపడుతూ కొండాపూర్లోని కిమ్స్ లో చేరారు. వైద్యులు ఆమెకు అన్ని రకాల పరీక్షలు జరిపి ఏప్రిల్ 17న వెయ్యి గ్రాముల శిశువుకు పురుడు పోశారు. మొదట్లో ఆరోగ్యంగానే ఉన్నా వారం తర్వాత శిశువుకు ఆక్సిజన్ లెవల్స్తోపాటు బరువు తగ్గడంతో వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది.
అప్రమత్తమైన వైద్యులు శిశువును సీనియర్ నియోనాటాలజీ అండ్ పీడియాట్రిక్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ సీ అపర్ణ సమక్షంలో వైద్యం అందించారు. వెంటిలేటర్ సపోర్ట్, ఇంట్రావీనస్ వంటి యాంటి బయోటిక్స్ అందిస్తూ చికిత్సచేశారు. ఎప్పటికప్పుడు బీపీ, ఆక్సిజన్ సాచురేషన్ తెలియజేసే మల్టీ పారామీటర్లతో పరీక్షలు జరిపారు. వెంటిలేటర్తోపాటు సీపీఏపీ (కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్) ద్వారా చికిత్స అందించారు. వేగంగా కోలుకోవడానికి స్టెరాయిడ్లను వాడారు.
పుట్టిన వారం రోజులకే చిన్నారికి పాజిటివ్ అని తేలడంతో భయమేసింది. వీడియో కాల్స్ ద్వారా వైద్యురాలు అపర్ణతో తరచూ మాట్లాడాం. ఆమె ఎంతో ధైర్యం చెప్పారు. కిమ్స్ వైద్యుల కృషితో ప్రస్తుతం తల్లితోపాటు చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నారు.
– చిన్నారి కుటుంబ సభ్యులు