ఖైరతాబాద్, జూన్ 24: దేశంలో కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన స్కిన్బ్యాంకు పేదల దవాఖాన ఉస్మానియాలో అందుబాటులోకి రానున్నది. రూ.60 లక్షల వ్యయంతో, 1,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో హెటిరోడ్రగ్స్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సహకారంతో దవాఖానలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఏర్పాటుచేసిన ఈ స్కిన్ బ్యాంకు రాష్ట్రంలోనే మొదటిది. దీనిని 28న హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించనున్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియాసమావేశంలో ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. ఏడు దశాబ్దాల క్రితమే స్కిన్బ్యాంక్ విధానం అమెరికా, యూరప్ దేశాల్లో ఉందని, దేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు, బెంగళూరు, ఒడిషా రాష్ర్టాల్లో అందుబాటులో ఉండగా, తర్వాత తెలంగాణలోనేనని చెప్పారు. స్కిన్బ్యాంక్ ఏర్పాటుతో అగ్నిప్రమాదంలో 50 శాతానికిపైగా కాలిపోయిన రోగులను స్కిన్గ్రాఫ్టింగ్ ద్వారా బతికించవచ్చని తెలిపారు. అధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన కోల్డ్ స్టోరేజి, ఇంక్యుబేటర్లలో సుమారు ఐదేండ్లపాటు చర్మాన్ని భద్రపరచవచ్చని తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో లక్షలు ఖర్చయ్యే ఈ చికిత్సను ఉస్మానియాలో ఉచితంగా చేస్తామని చెప్పారు. స్కిన్బ్యాంక్ ప్రారంభ కార్యక్రమంలో హెటిరో చైర్మన్ డాక్టర్ బీ పార్థసారథిరెడ్డి, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్-3,150 గవర్నర్ ఎన్వీ హన్మంత్రెడ్డి, వైద్యారోగ్య కార్యదర్శి రిజ్వీ, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ బీ నాగేందర్ పాల్గొంటారని తెలిపారు. ప్రెస్మీట్లో రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ అధ్యక్షుడు వైవీ గిరి, డైరెక్టర్లు సుదేశ్రెడ్డి, టీఎంఆర్ చౌదరి, అడ్మిన్, డైరెక్టర్ సత్యనారాయణ, కోశాధికారి సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.