హైదరాబాద్ : మెదక్ పార్లమెంట్ పరిధిలో చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణా కేంద్రాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో 377 నిబంధన కింద ఎంపీ ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మెదక్ పార్లమెంటు పరిధిలో సిద్దిపేట, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు మొత్తం ఏడు నియోజకవర్గాలలో సుమారు 30 వేల మంది నేతన్నలు ఉన్నారన్నారు. ఆధునిక సాంకేతికతలను అమలు చేస్తుండడంతో ప్రస్తుత చేనేత కార్మికుల నైపుణ్యాలకు సరిపోవడం లేదన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాల పెంపుదల కోసం తన పార్లమెంట్ పరిధిలో నైపుణ్య శిక్షణా కేంద్రాలు, సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేయాలని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రిని ఎంపీ కోరారు.