హైదరాబాద్ : పెట్టుబడి సాయంగా ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతోంది. బుధవారం రెండు ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న సుమారు 15.07 లక్షల మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మొత్తం రూ. 1,152.46 కోట్లు రైతు బంధు సహాయంగా పొందారు. మంగళవారం నుంచి మొత్తం 1,669.42 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. రేపు మూడవ రోజు 10.40 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.1272.85 కోట్లు జమకానున్నాయి.
మొత్తంమీద మూడు రోజులలో 42.43 లక్షల మంది రైతుల ఖాతాలలో రైతుబంధు కింద 58.85 లక్షల ఎకరాలకు గాను రూ.2,942.27 కోట్లు జమ అవుతున్నాయి. ఈ నెల 25 వరకు రైతులకు రైతుబంధు నిధుల పంపిణీని పూర్తి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పత్తి, కంది అధికంగా సాగు చేయడంతో పాటు రైతులు పప్పు దినుసులు, నూనెగింజల పంటల సాగును పెంచాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతాంగం దృష్టి సారించాలని పేర్కొన్నారు.