నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 18: రాష్ట్రంలో కొత్తగా ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. సంగారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, మహబూబాబాద్లలో వైద్య కళాశాలల ఏర్పాటుతోపాటు వీటికి అనుబంధంగా నర్సింగ్ కళాశాలలనూ నెలకొల్పుతామని సీఎం ప్రకటించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు.
పటాకులు కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. కొత్తగూడెంకు వైద్య కళాశాల మంజూ రు చేసినందుకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, స్థానిక ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. కరోనా వేళ వైద్య కళాశాల మంజూరు చేయడం శుభపరిణామమని పువ్వాడ పేర్కొన్నారు. మహబూబాబాద్కు వైద్య కళాశాల మంజూరుపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్నాయక్, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని పాలతో అభిషేకించారు. గత ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీమేరకు మానుకోటకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేశారని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.
కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకుంటారన్నారు. మానుకోటకు మెడికల్ కాలేజీ హామీని నిజంచేసిన దేవుడు సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత కొనియాడారు. తొర్రూరులో టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసి సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కొనియాడారు. జగిత్యాలలో జరిగిన సంబురాల్లో ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్కుమార్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, లక్షెట్టిపేట, చెన్నూర్ తదితర చోట్ల సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు.
సీఎం కేసీఆర్కు ఎమ్మెల్సీ కవిత కృతజ్ఞతలు
జగిత్యాల జిల్లా అభివృద్ధికి నిరంతరం తోడ్పాటునందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తొలుత జగిత్యాల జిల్లాను ఏర్పాటుచేశారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జగిత్యాలకు వైద్య కళాశాల మంజూరుచేసి జిల్లా ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన సీఎం కేసీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్, నర్సింగ్ కళాశాలల ఏర్పాటుతో జిల్లా దవాఖానస్థాయి, విస్తీర్ణం, పడకల సామర్థ్యం, ఇతర సదుపాయాలు పెరుగుతాయని ట్వీట్ చేశారు.