హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో తాజాగా మరో ఆరుగురిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. ఈ ముఠా తొమ్మిది నెలల్లో అకాడమీకి చెందిన 43 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లకు సంబంధించిన రూ.64.50 కోట్లు మాయం చేసిందని తెలిపారు. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం, వారి తప్పిదంతోనే కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. మాయమైన నిధులను బ్యాంకులే అకాడమీకి చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అకాడమీకి, బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన కీలక సూత్రధారి ఏపీ విశాఖపట్టణానికి చెందిన చందూరి వెంకట కోటి సాయికుమార్ వాటానే ఇందులో రూ.20 కోట్లుగా తేలింది. బుధవారం కమిషనరేట్లో అంజనీకుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తాజాగా అరెస్టయినవారిలో అకాడమీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి సెగూరి రమేశ్ అలియాస్ రవి, చందానగర్ కెనరా బ్రాంచి మేనేజర్ సాధన, దళారులు విశాఖకు చెందిన సాయికుమార్, తణుకుకు చెందిన నందూరి వెంకటరమణ, ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు వెంకటేశ్వర్రావు, ధర్మవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సోమశేఖర్ అలియాస్ రాజ్కుమార్ ఉన్నారు.