నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ప్రమాదం
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత
విద్యానగర్, మార్చి 23: క్షయను ప్రాథమిక దశలో గుర్తించి క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా నయం చేయవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. బుధవారం ప్రపంచ క్షయ నివారణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. క్షయను త్వరగా గుర్తించి చికిత్స పొందితే నయం చేయవచ్చన్నారు. ఈ వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుందని, రోగి దగ్గినప్పుడు, ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు క్రిములు తుంపర్ల ద్వారా గాలిలో వ్యాప్తి చెంది ఆరోగ్యవంతులు పీల్చితే సోకుతుందని తెలిపారు. హెచ్ఐవీ బాధితులకు క్షయ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రెండు వారాలకు మించి దగ్గు రావడం, బరువు తగ్గడం, ఆకలి మందగించడం, రాత్రి వేళల్లో జ్వరం రావడం క్షయ లక్షణాలని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణకు తేమడ పరీక్ష చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 279 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారని, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఎండీఆర్ వార్డును ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెమడ పరీక్షలో వ్యాధి నిర్ధారణ కోసం సీబీనాట్ పరికరాన్ని రూ.కోటి వెచ్చించి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తేమడ పరీక్షతో రెండు గంటల్లోనే రిపోర్టు వస్తుందని, వ్యాధి నిర్ధారణతో పాటు తీసుకోవాల్సిన డోస్ సైతం ఇందులో తెలుస్తుందన్నారు. క్షయకు ప్రభుత్వ దవాఖానల్లోనే మందులు ఇస్తారని, నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో 25 తెమడ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, చికిత్స కోసం ఆరు నుంచి రెండేళ్ల సమయం పడుతుందన్నారు. చికిత్స కాలంలో రోగికి పోషకాహారం కోసం నెలకు రూ. 500 ప్రభుత్వం ఇస్తుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 200 మంది రోగులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. క్షయ నియంత్రణాధికారి డాక్టర్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.