నిర్మల్ : భైంసాలో పరిస్థితి అదుపులోనే ఉందని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. భారీ పోలీస్ బందోబస్తుతో పరిస్థితిని చక్కదిద్దామని ఆయన అన్నారు. భైంసా అల్లర్లకు సంబంధించి మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భైంసా పట్టణంలో పరిస్థితిని దాదాపు 500 మంది పోలీసులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రెండువర్గాల యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ అల్లర్లకు దారి తీసినట్లు చెప్పారు. ‘ఘర్షణలో అల్లరిమూకలు నాలుగు ఇళ్లు, 13 దుకాణాలు, కొన్ని వాహనాలకు నిప్పుపెట్టడంతో దహనం అయ్యాయి. అల్లర్ల కేసులో ఇప్పటికే 38 మందిని అరెస్టు చేశాం’ అని ఐజీ నాగిరెడ్డి తెలిపారు.
భైంసాలో ఈ నెల 8న రాత్రి 8 గంటల సమయంలో ఇరువర్గాల నడుమ వివాదం తలెత్తింది. దీంతో అల్లరిమూకలు రెండు వర్గాలుగా విడిపోయి రాళ్లు రువ్వుకోవడం, కత్తులు, ఇనుపరాడ్లతో దాడులు చేసుకోవడంతో భయాందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రామగుండం సీపీ సత్యనారాయణ, నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు వారియర్ భైంసా చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.